
కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతున్న దృష్ట్యా శబరిమలలో భక్తులను అనుమతి లేదని తాజాగా కేరళ ప్రభుత్వం ప్రకటించింది. వైరస్ కట్టడి చర్యల్లో భాగంగా భక్తులను శబరిమలకు అనుమతించమని మంత్రి కడకంపల్లి సురేంద్రన్ ప్రకటించారు. శబరిమల దేవాలయ ప్రధానార్చకులు, ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు సభ్యులతో మంత్రి సమావేశం అయ్యారు. అనంతరం, ఆలయంలో జరిపే నెలవారీ పూజలతోపాటు ఆలయ ఉత్సవాలను కూడా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. అయితే, ఆలయంలో సాధారణంగా జరిగే పూజలు మాత్రం కొనసాగుతాయని తెలిపారు.
జూన్ 14వ తేదీ నుంచి శబరిమలలో పరిమిత సంఖ్యలో భక్తులను అనుమతిస్తామని ట్రావెన్కోర్ బోర్డు ఇదివరకు ప్రకటించింది. వర్చువల్ క్యూ సిస్టమ్లో నమోదు చేసుకున్న భక్తులను ఆలయంలోకి అనుమతించడంతోపాటు ఆలయ ఉత్సవాలు కూడా నిర్వహిస్తామని వెల్లడించింది. అయితే, తాజాగా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో భక్తులకు అనుమతి లేదని స్పష్టం చేసింది.
ఇదిలా ఉంటే, దేశవ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభణ తీవ్రతరమౌతోంది. గురువారం నాటికి దేశంలో 2,86,579 పాజిటివ్ కేసులు నమోదుకాగా మరణాల సంఖ్య 8102కి చేరింది. కేరళలో ఇప్పటివరకు 2161 పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా వీరిలో 18మంది మృత్యువాతపడ్డారు.