News

శ్రీశైల దేవస్థానంలో అవినీతిపై విచారణ ప్రారంభం

750views

ర్నూలు జిల్లాలోని శ్రీశైల క్షేత్రంలో వెలుగు చూసిన భారీ అవినీతిపై దేవాదాయశాఖ విచారణ చేపట్టింది. దేవాదాయశాఖ అదనపు కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌ నేతృత్వంలో విచారణ కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. రామచంద్ర మోహన్‌ వెంటనే శ్రీశైలం వెళ్లాలని దేవాదాయశాఖ కమిషనర్‌ అర్జునరావు ఆదేశించారు. రామంద్రకు సహకరించాలని శ్రీశైలం ఈవో కె.ఎస్‌.రామారావుకు సూచించారు.

పొరుగుసేవల సిబ్బందే సూత్రధారులు..

బ్యాంకుల తరఫున పనిచేసే పొరుగు సేవల సిబ్బంది రూ.1.42 కోట్లను స్వాహా చేసినట్లు దేవస్థానం ఈవో కె.ఎస్‌.రామారావు సోమవారం వెల్లడించిన విషయం తెలిసిందే. కంప్యూటర్‌లోని సాఫ్ట్‌వేర్‌ను దుర్వినియోగం చేసి రూ.150 దర్శనం టిక్కెట్లు, అభిషేకం టిక్కెట్ల సొమ్మును పక్కదారి పట్టించినట్లు విచారణలో వెల్లడైనట్లు ఈవో స్పష్టం చేశారు. అవినీతి ఆరోపణలు వచ్చిన వెంటనే విచారణ చేయాలని సహాయ కార్యనిర్వాహణాధికారి హరిదాసును ఈవో ఆదేశించారు. ఆయన ఆధ్వర్యంలో సర్వర్‌ రూమ్‌ సిబ్బంది నిపుణుల సహకారంతో ఈ అక్రమాలను బయటపెట్టారు.

కుంభకోణంపై కేసు నమోదు

శ్రీశైలం దేవస్థానం ఫిర్యాదు మేరకు దర్శనం, ఆర్జిత సేవల టికెట్ల కుంభకోణంపై శ్రీశైలం ఒకటో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హరిప్రసాద్‌ తెలిపారు. రూ.76 లక్షల అవినీతిలో 14 మంది, రూ.66 లక్షల అవినీతిలో ఆరుగురిపై మోసం, ఐటీ చట్టం కింద కేసులు నమోదు చేశామన్నారు. ఈ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ చేయడానికి ఆత్మకూరు డీఎస్పీ వెంకట్రావును ప్రత్యేక అధికారిగా నియమిస్తూ జిల్లా ఎస్పీ ఫక్కీరప్ప ఉత్తర్వులు జారీ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.