
భారత ఆర్మీకి చెందిన మేజర్ సుమన్ గవానీ ప్రఖ్యాత ‘2019 ఐక్యరాజ్యసమితి మిలిటరీ జెండర్ అడ్వొకేట్ ఆఫ్ ది ఇయర్ అవార్డు’కు ఎంపికయ్యారు. లైంగిక హింసకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితి చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించినందుకు ఆమెను ఈ అవార్డు వరించింది. సుమన్ శక్తివంతమైన ఆదర్శ మహిళ అని ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రశంసించారు. ”సహాయపడే తత్వం, మార్గదర్శకత్వం, దిశానిర్దేశం, నాయకత్వ లక్షణాలు కలిగిన సుమన్ గవానీ ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షక దళాలకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు సహాయపడ్డారు.” అని ఐక్యరాజ్యసమితి ఈ ఉదయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.
మేజర్ సుమన్ గవానీ భారతీయ సైన్యంలో ఆర్మీ సిగ్నల్ కార్ప్స్ విభాగంలో విధులు నిర్వహిస్తున్నారు. కాగా, ఆమె దక్షిణ సూడాన్లో ఐక్యరాజ్యసమితి సైనిక పరిశీలకురాలిగా నియమితులయ్యారు. ఘర్షణల నేపథ్యంలో తలెత్తే లైంగిక హింసను అరికట్టేందుకు సుమన్ ఇప్పటి వరకూ 230 మందికి పైగా సైనిక పరిశీలకులకు, దక్షిణ సూడాన్ భద్రతా దళాలకు శిక్షణనిచ్చారు. ఆ విధంగా ప్రతి పరిశీలన బృందంలోనూ ఓ మహిళ ఉండేలా సహాయ పడ్డారు.
ఈ సందర్భంగా శ్రీమతి సుమన్ మాట్లాడుతూ ”మన కర్తవ్యం, స్థానం, స్థాయి ఏదైనా శాంతిరక్షక దళ సభ్యులుగా స్త్రీ-పురుష సమానత్వాన్ని మన రోజువారీ కర్తవ్య నిర్వహణలో భాగం చేసుకోవాలి. ఈ విధానాన్ని మన సహోద్యోగులు, సమాజంలోని వారితో కూడా పాటించాలి.” అని తెలిపారు. ఐక్యరాజ్య సమితి శాంతిపరిరక్షక దినోత్సవం సందర్భంగా ఈ శుక్రవారం జరుగనున్న ఓ కార్యక్రమంలో అధ్యక్షుడు గుటెరస్ చేతుల మీదుగా ఆమె ఈ అవార్డును అందుకుంటారు. బ్రెజిల్కు చెందిన మరో మహిళా నౌకాదళ అధికారి కార్లా మాంటేరియో డీ కాస్ట్రో అరాజువోతో కలిసి సంయుక్తంగా సుమన్ గవానీ ఈ పురస్కారాన్ని స్వీకరిస్తారు.





