మరాఠా గడ్డపై అష్ట గణపతి క్షేత్రాలు
( ఆగస్ట్ 27 - వినాయక చవితి ) పంచారామాలు, ద్వాదశ జ్యోతిర్లింగాలు, అష్టాదశ శక్తిపీఠాలు ఇలా కొన్ని పుణ్యక్షేత్రాలు ఒక సంఖ్యతో చెప్పుకుంటూ ఉంటాం. అలాగే ప్రసిద్ధి చెందాయి ఆ క్షేత్రాలు. ఆ కోవలో చెప్పుకోవలసినవే అష్టగణపతి ఆలయాలు. ఇవి వినాయక ఉత్సవాలకు అత్యంత ప్రసిద్ధి చెందిన, గాణాపత్య సంప్రదాయానికి పెట్టింది పేరైన మహారాష్ట్రలో, వివిధ ప్రదేశాల్లో కొలువుతీరి ఉన్నాయి. ఇవి స్వయంభూ వినాయక ఆలయాలు. ఈ దేవాలయాల గురించి హిందువుల పవిత్ర గ్రంథాలైన గణేశ్ ముద్గల పురాణాలలో కూడా ప్రస్తావన ఉందని చెప్తారు పెద్దలు. అష్టగణపతి ఆలయాలు దర్శించుకుంటే సకలకష్టాలు తొలగి, సర్వసుఖాలు కలుగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ అష్ట గణపతి యాత్రలో మొట్టమొదట చెప్పుకోవలసినది మయూర గణపతి క్షేత్రం. మయూరగణపతి క్షేత్రం ఈ క్షేత్రం మహారాష్ట్రలోని బారామతి తాలూకాలోని ‘మోర్ గావ్’...






