
640views
పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) కారణంగా దేశరాజధాని ఢిల్లీలోని మౌజ్పూర్ ప్రాంతంలో మరోసారి ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మౌజ్పూర్ ప్రాంతంలో కొందరు సీఏఏకు మద్దతుగా అనుకూల ర్యాలీ ప్రారంభించారు. ఇప్పటికే సీఏఏ వ్యతిరేక నిరసనలు కొనసాగుతున్న జఫ్రాబాద్ ప్రాంతానికి మౌజ్పూర్ అతి సమీపంలో ఉంది. ఈ క్రమంలో సీఏఏ అనుకూల, వ్యతిరేక ప్రదర్శనలు రెండు వర్గాల మధ్య ఘర్షణకు తావు తీశాయి. ఇరు వర్గాలు రాళ్లు విసురుకున్నట్లు మీడియా వర్గాలు వెల్లడించాయి. పరిస్థితి చేజారడంతో సీఆర్పీఎఫ్ బలగాలను రంగంలోకి దింపారు. పోలీసులు భాష్పవాయు ప్రయోగం చేయడంతో పలువురికి గాయాలైనట్లు తెలుస్తోంది. పోలీసులపైనా రాళ్లు విసిరినట్లు సంయుక్త పోలీసు కమిషనర్ అలోక్ కుమార్ తెలిపారు. భద్రతా బలగాలను దింపి పరిస్థితిని అదుపులోకి తెచ్చినట్లు చెప్పారు.





