News

ఉగ్రవాదులను వేటాడి మరీ పట్టుకుంటాం : అమిత్ షా

274views

పహల్గాం ఉగ్రదాడిపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న ప్రతి ఉగ్రవాదినీ వేటాడి పట్టుకుంటామని ప్రకటించారు. ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అని అన్నారు. అందుకు ప్రతిషలం అనుభవించేలా చేస్తామని ప్రకటించారు. ఢిల్లీలో అసోం బోడో సమాజం నాయకుడు ఉపేంద్రనాథ్‌ బ్రహ్మ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పహల్గాం దాడికి గట్టిగా బదులిస్తామని, ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని చెప్పారు.

ఇది మోదీ ప్రభుత్వమని, ఉగ్రదాడికి పాల్పడిన వారెవ్వరూ తప్పించుకోలేరని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌ షా స్పష్టం చేశారు. ఈ పోరాటంలో భారతీయులే కాదు ప్రపంచమంతా భారత్‌తో నిలుస్తోందని అన్నారు.

ప్రభుత్వం వారిపై బలంగా పోరాడుతుందని పేర్కొంటూ మన పౌరుల ప్రాణాలు బలిగొని ఉగ్రవాదులు యుద్ధంలో విజయం సాధించామనుకుంటే పొరపాటేనని చెప్పారు. ఉగ్రవాదం నిర్మూలించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని తేల్చి చెప్పారు. ఈ దుశ్చర్యకు పాల్పడ్డ వారికి తప్పనిసరిగా శిక్ష పడుతుందని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో అది ఈశాన్య ప్రాంతమైనా, వామపక్ష తీవ్రవాదం ఉన్న ప్రాంతం అయినా, కశ్మీర్‌పై ఉగ్రవాద నీడ అయినా ప్రభుత్వం అందరికీ బలమైన సమాధానం ఇస్తుందని అమిత్ షా హెచ్చరించారు. ఎవరినీ వదిలిపెట్టబోమని, దేశంలోని ప్రతి అంగుళం నుంచి ఉగ్రవాదాన్ని నిర్మూలించాలని సంకల్పించినట్లు పేర్కొన్నారు.