News

మూడువేల ఏళ్లనాటి శివపార్వతుల ప్రతిమలు లభ్యం

175views

యూపీలోని మధురలో అత్యంత పురాతన శివపార్వతుల విగ్రహాలు లభ్యమయ్యాయి. బెనారస్‌ హిందూ యూనివర్శిటీ(బీహెచ్‌యూ)లో జరుగుతున్న అంతర్జాతీయ సదస్సులో ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ)కి చెందిన పురావస్తు శాస్త్రవేత్త డాక్టర్ వినయ్ కుమార్ గుప్తా మాట్లాడారు.

మూడు వేల ఏళ్ల క్రితం నాటి శివుడు, పార్వతిలకు చెందిన మట్టి ప్రతిమలు మధురలో లభమయ్యాయని తెలిపారు. ఈ ఏడాది మేలో బ్రజ్‌లోని గోవర్ధన్ పర్వతం దగ్గర తవ్వకాలు జరిగాయన్నారు. ఈ సందర్భంగా భూమికి 15 మీటర్ల దిగువన విగ్రహాలు కనుగొన్నామన్నారు. 4,800 ఏళ్ల క్రితం గణేశ్వర నాగరికత ఆధారాలు కూడా కనిపించాయన్నారు. మొదటి శతాబ్దం కాలం నాటి శివపార్వతుల ఆరాధనకు సంబంధించిన పురావస్తు ఆధారాలు లభించాయన్నారు.

మధురలో మహాభారత కాలం నాటి సుమారు ఎనిమిది మీటర్ల మందపాటి పొర నిక్షేపం అంటే పెయింటెడ్ గ్రే వేర్ కల్చర్ కనుగొన్నామన్నారు. ఎండిపోయిన ఒక పురాతన నది కాలువ 23 మీటర్ల లోతులో ఉన్నట్లు తేలిందన్నారు. ప్రపంచ పురావస్తు శాస్త్రంలో ఇది అత్యంత అపూర్వమైన విజయయమని, బలి, అగ్ని దేవతల విగ్రహాల అవశేషాలు ఆ నాటి ఆధ్యాత్మిక,సాంస్కృతిక పద్ధతులను తెలియజేస్తాయన్నారు.