News

‘ఇరుముడి’తోనే విమాన ప్రయాణ వెసులుబాటు : రామ్మోహన్‌ నాయుడు

235views

శబరిమల అయ్యప్ప మాల ధరించే స్వాములకు పౌరవిమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు తీపికబురు చెప్పారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి కేరళలోని శబరిమలకు మాలధారులు ఇరుముడితోనే విమానాల్లో ప్రయాణించవచ్చని తెలిపారు. అయ్యప్ప భక్తుల వినతితో ఈ మేరకు నిబంధనలను సడలించినట్టు చెప్పారు. అందుకు అనుగుణంగా పౌరవిమానయాన భద్రతా విభాగం డైరెక్టర్‌ జనరల్‌ ఉత్తర్వులు ఇచ్చారని తెలిపారు. శ్రీకాకుళంలోని క్యాంపు కార్యాలయం నుంచి మంత్రి ఓ వీడియో సందేశం విడుదల చేశారు. భద్రతా కారణాల రీత్యా విమానంలో కొబ్బరికాయతో కూడిన ఇరుముడిని ఇన్నాళ్లూ అనుమతించలేదన్నారు. దీంతో స్వాములు రైళ్లు, బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించాల్సి వచ్చేదని తెలిపారు. ఈ క్రమంలో అయ్యప్ప భక్తుల విజ్ఞప్తి మేరకు నిబంధనలు సడలించామని, ఈ సౌలభ్యం మకరజ్యోతి దర్శనం ముగిసేవరకు(జనవరి 20) అందుబాటులో ఉంటుందని తెలిపారు. తాజా ఉత్తర్వులతో ఎయిర్‌పోర్టు సిబ్బంది స్కానింగ్‌ చేసిన తర్వాత భక్తులు నేరుగా ఇరుముడితో విమానాల్లో ప్రయాణం చేయవచ్చన్నారు.