
301views
ఉత్తరాంధ్ర ప్రజల ఇలవేల్పు విజయనగరం పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం వైభవంగా సాగుతోంది. అమ్మవారి సిరిమానోత్సవం తిలకించేందుకు వేలాది మంది భక్తులు విజయనగరం చేరుకోవడంతో వీధులు జనసంధ్రంలా మారాయి. అమ్మవారి ప్రతిరూపంగా పూజారి బంటుమిల్లి వెంకట్రావు సిరిమాను అధిరోహించారు.
తెల్లటి ఏనుగు రథం, అజలి రథం, పాలధార, జాలరివల ముందు సాగగా, ప్రధాన ఆలయం నుంచి గజపతుల కోట వరకు సిరిమాను ఊరేగింపు కొనసాగుతోంది. జై పైడిమాంబ..జైజై పైడిమాంబ అంటూ వేలాది భక్తులు అరటిపండ్లు విసురుతూ తమ మొక్కులు తీర్చుకున్నారు. గజపతుల ఆడపడుచులు కోటపై నుంచి అమ్మవారి ఉత్సవాలు తిలకించారు. 5 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చారు. రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ప్రభుత్వం కోటిన్నరతో ఏర్పాట్లు చేసింది. దాదాపు 2 వేల మంది పోలీసులతో భద్రతా ఏర్పాట్లు చేశారు.





