
బీజేపీ పార్టీ, కేంద్ర ప్రభుత్వ విధానాలను ఎప్పటికప్పుడు విమర్శిస్తూ తిరుగుబాటు ధోరణితో ఉండే బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీపై కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. వరుణ్ గాంధీ కాంగ్రెస్లో చేరతారని, భారత్ జోడో యాత్రలో త్వరలో పాల్గొనవచ్చనే ఊహాగానాలకు ఆయన స్వస్తి పలికారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ వరుణ్ గాంధీని అంగీకరించదని స్పష్టం చేశారు. వరుణ్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు భిన్నమైనవని రాహుల్ గాంధీ అన్నారు. తాను వరుణ్ గాంధీని కలవగలను, కౌగిలించుకోగలను కానీ.. అతన్ని ఎన్నటికీ అంగీకరించలేనని చెప్పాడు. భారత్ జోడో యాత్రలో ఉన్న రాహుల్ గాంధీ.. తమ సిద్ధాంతాలు, వరుణ్ గాంధీ సిద్ధాంతాలు సరిపోలడం లేదని అన్నారు.
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) సిద్ధాంతాన్ని వరుణ్ గాంధీ ఎప్పుడో అంగీకరించారని రాహుల్ గాంధీ అన్నారు. తాను ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి ఎప్పటికీ వెళ్లలేనని.. అంతకు ముందు కావాలంటే తన తల తీసేయొచ్చని అన్నారు. తన కుటుంబానికి ఒక భావజాలం, ఆలోచనా విధానం ఉందన్నారు. ఆరెస్సెస్, కాంగ్రెస్ మధ్య సైద్ధాంతిక పోరు సాగుతోందని రాహుల్ గాంధీ అన్నారు. ఇదిలా ఉండగా అధికార బీజేపీకి సైద్ధాంతిక మూలమైన ఆర్ఎస్ఎస్ చేస్తున్న పనిని వరుణ్ గాంధీ ప్రశంసించిన సంఘటనను కూడా రాహుల్ గాంధీ ప్రస్తావించారు.
దేశంలో ఆర్ఎస్ఎస్ చాలా మంచి పని చేస్తోందని కొన్నాళ్ల క్రితం వరుణ్ గాంధీ తనతో చెప్పారని అన్నారు. మా కుటుంబ చరిత్రను చదివి అర్థం చేసుకోమని చెప్పానని.. తమ కుటుంబం యొక్క భావజాలాన్ని అర్థం చేసుకుంటే ఎవరూ అలా అనరని వ్యాఖ్యానించారు. దేశంలోని అన్ని సంస్థలపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్), భారతీయ జనతా పార్టీ (బిజెపి) నియంత్రణ ఉందని రాహుల్ గాంధీ ఆరోపించారు.
దేశంలోని మీడియా, బ్యూరోక్రసీ, ఎన్నికల సంఘం, న్యాయవ్యవస్థ ఒత్తిడిలో ఉన్నాయని రాహుల్ గాంధీ ఆరోపించారు. పంజాబ్లోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని కూడా రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. పంజాబ్ పాలనను ఢిల్లీ నుండి కాకుండా పంజాబ్ నుండి నిర్వహించాలని అన్నారు. ప్రస్తుతం ఒక రాజకీయ పార్టీ మరో రాజకీయ పార్టీతో పోరాటం కాదని… ఇప్పుడు తమ పోరాటం దేశంలోని వాళ్లు స్వాధీనం చేసుకున్న సంస్థలతో పోరాటం జరుగుతోందని రాహుల్ గాంధీ అన్నారు.





