ArticlesNews

రూ.4 వేల కోట్ల విలువైన కీలక ఆయుధ కొనుగోళ్లకు రక్షణశాఖ సంసిద్ధం!

331views

సైనిక దళాల పోరాట సామర్థ్యాన్ని మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ శాఖ మూడు కీలక ఆయుధ సమీకరణ ప్రాజెక్టులకు పచ్చజెండా ఊపింది. వీటి విలువ రూ.4,276 కోట్లు ఉంటుందని అంచనా.. ఇటీవల రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ అధ్యక్షతన సమావేశమైన రక్షణ కొనుగోళ్ల మండలి (డీఏసీ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. అధునాతన ఆయుధాలు కొనుగోళ్లకు మొగ్గు.. ట్యాంకు విధ్వంసక హెలీనా గైడెడ్‌ క్షిపణుల కొనుగోలుకు సమ్మతి తెలిపారు. ఈ అస్త్రాలు, లాంచర్లు, సంబంధిత ఇతర సాధన సంపత్తిని సైన్యంలోని అడ్వాన్స్డ్‌ లైట్‌ హెలికాప్టర్‌ (ఏఎల్‌హెచ్‌)కు అనుసంధానిస్తారు. దీనివల్ల భారత బలగాల దాడి సామర్థ్యం పెరుగుతుంది. చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి గగనతల రక్షణ వ్యవస్థకు ఊతమివ్వడానికి ‘వెరీ షార్ట్‌రేంజ్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ సిస్టమ్‌’ (వీఎస్‌హెచ్‌ఓఆర్‌ఏడీ) క్షిపణుల సమీకరణకు పచ్చజెండా ఊపారు. వీటిని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థను సైనికుడు తన భుజం మీద మోసుకెళ్లొచ్చు. అవసరమైన ప్రాంతాల్లో వేగంగా మోహరించొచ్చు. ఉత్తర సరిహద్దుల్లో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా ఇలాంటి సమర్థ గగనతల రక్షణ వ్యవస్థలు అవసరమని రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. నౌకాదళంలోని శివాలిక్‌ తరగతి యుద్ధనౌకలు, భవిష్యత్‌ తరం పోరాట నౌకలైన ‘నెక్స్ట్‌ జనరేషన్‌ మిసైల్‌ వెసెల్‌’ (ఎన్‌జీఎంవీ) కోసం బ్రహ్మోస్‌ లాంచర్‌, ఫైర్‌ కంట్రోల్‌ వ్యవస్థల కొనుగోలుకూ డీఏసీ ఆమోదం తెలిపింది. వీటివల్ల ఆ యుద్ధనౌకల పోరాట సామర్థ్యం రాటుదేలుతుంది.