News

మాస్కో – ఢిల్లీ విమానానికి బాంబు బెదిరింపు

415views

న్యూఢిల్లీ: మాస్కో నుంచి 400 మంది ప్రయాణికులతో రావాల్సిన విమానానికి శుక్రవారం తెల్లవారుజామున బాంబు బెదిరింపు వచ్చింది. ఓ ఈ-మెయిల్‌ ద్వారా బెదిరింపు వచ్చినట్టు అధికారులు తెలిపారు. ఢిల్లీలోని ఇందిరా గాంధీ విమానాశ్రయానికి గురువారం రాత్రి ఆ బెదిరింపు మెయిల్‌ వచ్చింది. బెరిరింపు మెయిల్‌తో భద్రతా దళాలు అలర్ట్‌ అయ్యాయి. ఎయిర్‌పోర్ట్‌ వద్ద సెక్యూర్టీని పెంచారు.

ఢిల్లీ విమానాశ్రయంలో మాస్కో విమానం తెల్లవారుజామున 3.20 గంటలకు దిగింది. విమానం ల్యాండింగ్ అవగానే విమానంలోని ప్రయాణికులు, విమాన సిబ్బందిని వెంటనే దించి వేశారు. అనంతరం ఢిల్లీ పోలీసులు విమానంలో తనిఖీలు జరిపారు.

బాంబు బెదిరింపు వచ్చిన విమానాన్ని చెక్‌ చేశామని, దాంట్లో ఏమీ గుర్తించలేదని అధికారులు తెలిపారు. ఆ విమానాన్ని వేరు చేశామని అధికారులు వెల్లడించారు.

ఫ్లైట్ ల్యాండ్ కాగానే అందులోని 386 మంది ప్రయాణికులు, 14 మంది సిబ్బందిని సురక్షితంగా కిందకు దించి..తనిఖీలు చేశారు. ఈ తనిఖీల్లో ఎలాంటి బాంబు, ఇతర పేలుడు వస్తువులు కన్పించకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రస్తుతం విమానాన్ని ఐసోలేషన్‌లో ఉంచారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

గురువారం రాత్రి 11.15 నిమిషాలకు బాంబు బెదిరింపు కాల్‌ వచ్చిందని, మాస్కో నుంచి మూడవ టర్మినల్‌కు చేరుకోవాల్సిన ఆ విమానంకు బెదిరింపు వచ్చిందన్నారు. 29వ రన్‌వేపై ఫ్లయిట్‌ SU232 ల్యాండ్‌ అయినట్టు అధికారులు చెప్పారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి