
* లైంగిక ఆరోపణలతో మనస్తాపం
* మఠాధిపతులపై లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక, హిందూ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉన్నదేమోనని పలువురి సందేహం
కర్ణాటకలో పీఠాధిపతులపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోక్సో కేసులో చిత్రదుర్గ మురుగ మఠాధిపతి శివమూర్తి శరణారు ఏకంగా అరెస్ట్ అయ్యారు. హైస్కూల్ స్టూడెంట్ పై లైంగిక వేధింపుల ఆరోపణలతో ప్రస్తుతం శివమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. తాజాగా.. ఈ తరహా ఆరోపణలు ఎదుర్కొన్న మఠాధిపతి ఒకరు సోమవారం ఉదయం ఆత్మహత్యకు పాల్పడ్డారు.
బెలగావిలోని శ్రీ గురు మదివాలేశ్వర్ మఠ్ కు చెందిన బసవ సిద్ధలింగ స్వామి ఉరి వేసుకుని ప్రాణం తీసుకున్నారు. ఘటనాస్థలంలో సూసైడ్ నోట్ దొరికింది. అయితే అందులో ఏముందనేది మాత్రం పోలీసులు వెల్లడించలేదు. తన క్వార్టర్స్ లోనే ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచర గణం పోలీసులకు వెల్లడించింది.
తాజాగా ఇద్దరు వ్యక్తులు, కర్ణాటకలోని మఠాలలో జరుగుతున్న లైంగిక దాడుల గురించి ప్రస్తావిస్తూ ఓ వీడియోను విడుదల చేశారు. అది సంచలనంగా మారింది. అందులో లింగాయత్ కమ్యూనిటీకి చెందిన బసవ సిద్ధలింగ పేరు కూడా ప్రస్తావన వచ్చింది. దీంతో ఆయన మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు అనుచరులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కర్ణాటకలోని మఠాధిపతులపై వరుసగా వెల్లువెత్తుతున్న లైంగిక వేధింపుల ఆరోపణల వెనుక, హిందూ వ్యతిరేక శక్తుల ప్రమేయం వుండే అవకాశం ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.





