
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్ధ(ఎన్ఐఏ) సోదాలు కలకలం సృష్టిస్తున్నాయి. చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కో కన్వీనర్ రాధ, సభ్యురాలు అనితల ఇండ్లలో ఎన్ఐఏ తనిఖీలు నిర్వహించింది. హైదరాబాద్, హన్మకొండలలో సోదాలు చేపట్టింది. న్యూ ప్రకాష్ రెడ్డి పేటలోని ప్రభుత్వ టీచర్, చైతన్య మహిళా సంఘం నాయకురాలు అనిత ఇంట్లో ఎన్ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు.
స్థానిక పోలీసులు అనిత ఇంటివద్ద మోహరించి అటు వైపు ఎవరూ వెళ్ళకుండా చర్యలు చేపట్టారు. సామాజిక కార్యకర్తగా మహిళా చైతన్య కార్యక్రమాలు అనిత నిర్వహిస్తారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనే అనుమానంతో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. అనిత ఇంట్లో మూడుగంటల పాటు సోదాలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు మహిళల మ్యానిఫెస్టో, పాటల పుస్తకాలు తీసుకెళ్ళారు.
తమ కుమార్తె రాధను నర్సింగ్ చదివిస్తామని చెప్పి తీసుకెళ్లారని 2017 డిసెంబరులో విశాఖలోని పెదబయలు పీఎస్లో రాధ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మావోయిస్టు అనుబంధ సంస్థ చైతన్య మహిళా సంఘం (సీఎంఎస్) నాయకులు రాధను కిడ్నాప్ చేసి బలవంతంగా మావోయిస్టు పార్టీలో చేర్చుకున్నారని రాధ తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. సీఎంఎస్ నాయకులు దేవేంద్ర, స్వప్న, హైకోర్టు న్యాయవాది శిల్ప, తదితరులు తమ నివాసానికి వచ్చేవారని ఫిర్యాదులో తెలిపారు. వైద్యం పేరుతో దేవేంద్ర రాధను తీసుకెళ్లినట్లు ఫిర్యాదులో వెల్లడించారు. ఈ క్రమంలో విచారణ ప్రారంభించిన ఎన్ఐఏ అధికారులు.. గతంలోనే శిల్ప, దేవేంద్ర, స్పప్న, నరేందర్ నివాసాల్లో ఎన్ఐఏ సోదాలు జరిపింది. ఇదే కేసులో ఎన్ఐఏ అధికారులు మరోసారి సోదాలు జరుపుతున్నారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ.. గతంలో చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు ఉండేవని, ప్రస్తుతం కమిటీలు లేవని తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా తమ ఆక్టివిటీస్ కొనసాగుతున్నాయని చెప్పారు. ఆరు నెలలకు ఓసారి సమావేశం నిర్వహిస్తామని, మహిళా చైతన్య కార్యక్రమాలు చేపడతామని తెలిపారు. ఇటీవల జరిగిన సమావేశం వివరాలు రాసుకున్న బుక్ ని ఎన్ఐఏ అధికారులు తీసుకెళ్ళారని చెప్పారు. గతంలో కూడా కార్యాలయానికి పిలిచి మాట్లాడారని తెలిపారు. ప్రస్తుతం ఛత్తీస్ గఢ్, తెలంగాణ సరిహద్దుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే సమాచారంతో వారం రోజులుగా పోలీస్ ప్రత్యేక బలగాలు సరిహద్దులో మోహరించి కూంబింగ్ చేపట్టాయి. ఓ వైపు సరిహద్దుల్లో పోలీసుల కూంబింగ్, మరోవైపు మావోయిస్టుల సానుభూతిపరుల గురించి ఎన్ఐఏ ఆరా తీయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో అనిత ఇంట్లో సోదాలు నిర్వహించడం ప్రాధాన్యత సంతరించుకుంది.