
జూబ్లీహిల్స్: జూబ్లీహిల్స్ అత్యాచారం కేసులో నిందితుల తల్లిదండ్రులపై కేసులు నమోదయ్యాయి. పోక్సో చట్టం ప్రకారం మైనర్లపై అత్యాచారం జరిగినప్పుడు ఆ విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం ఇవ్వకపోవడాన్ని నేరంగా పరిగణిస్తారు. సాదుద్దీన్ సహా మిగతా నిందితుల తల్లిదండ్రులకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. బెంజ్, ఇన్నోవా కార్లను మైనర్లు నడిపినట్టు సాక్ష్యాలు సేకరించడంతో ట్రాఫిక్, శాంతిభద్రతల పోలీసులు కేసులు నమోదు చేశారు.
బాలికపై అత్యాచారానికి పాల్పడిన నిందితులు ఆ తర్వాత ఆధారాలను చెరిపివేసే ప్రయత్నం చేసినట్టు పోలీసులు సాక్ష్యాలను కూడా సేకరించారు. బాధితురాలిని తీసుకెళ్ళిన ఇన్నోవా కారు పోలీసుల దృష్టిలో పడకుండా ప్రభుత్వ సంస్థ చైర్మన్ కారును డ్రైవర్కు అప్పగించారు. అతడు దానిని మొయినాబాద్ సమీపంలోని అజీజ్నగర్లో ఓ వ్యవసాయ క్షేత్రంలో నిలిపి వచ్చేశాడు. ఆ క్షేత్రం ప్రభుత్వ సంస్థ చైర్మన్దేనని విచారణలో నిందితులు పోలీసులకు తెలిపారు.
అత్యాచారానికి పాల్పడిన తర్వాత ఏం జరుగుతుందన్న దానిపైనా నిందితులు ఓ కన్నేసి ఉంచినట్టు విచారణలో పోలీసులు తెలుసుకున్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో బాలిక తండ్రి ఫిర్యాదు చేసిన వెంటనే విషయం తెలిసిన సాదుద్దీన్, మిగతా ఐదుగురు మైనర్లు తలోదిక్కుకు పరారయ్యారు. ఓ నిందితుడు ఊటీలో ఉన్న తన తల్లి వద్దకు వెళ్ళాడు. మరో నిందితుడు నెల్లూరు దర్గాకు వెళ్ళగా అక్కడ పోలీసులకు పట్టుబడ్డాడు. మధ్యవర్తుల ఆధారంగా మరో ఇద్దరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.
Source: NationalistHub





