
న్యూఢిల్లీ: విదేశీ వస్తువుల పట్ల బానిసత్వ వైఖరిని విడనాడాలని, భారత్లో తయారైన వస్తువులను స్వీకరించాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. విదేశీ వస్తువులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలని చెప్పారు. స్థానిక ఉత్పత్తులకే ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు. స్టార్టప్ల ఏర్పాటుకు అనుకూల వాతావరణం ఉందని చెప్పారు.
జైన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన JITO Connet 2022 బిజినెస్ మీట్ను వీడియో లింక్ ద్వారా శుక్రవారం మోదీ ప్రారంభించారు. అనంతరం మోదీ మాట్లాడుతూ, నేడు మన దేశం సాధ్యమైనంత వరకు ప్రతిభ, వ్యాపారం, సాంకేతిక పరిజ్ఞానాలను ప్రోత్సహిస్తోందని చెప్పారు. భారత దేశంలో స్టార్టప్ లు పెరిగిందన్నారు. మన దేశంలో ప్రతి రోజూ డజన్లకొద్దీ స్టార్టప్ కంపెనీలు నమోదవుతున్నాయన్నారు.
వారానికి ఓ యూనికార్న్ ఏర్పడుతోందని చెప్పారు. విదేశీ ఉత్పత్తులపై ఆధారపడటాన్ని తగ్గించుకోవాలన్నారు. ఎగుమతుల కోసం నూతన అవకాశాలను గుర్తించాలని కోరారు. ఈ అంశాలపై స్థానిక మార్కెట్లలో అవగాహన కల్పించాలని చెప్పారు. ఉత్పత్తుల్లో లోపాలు ఉండకూడదని, పర్యావరణంపై ఎంతమాత్రం ప్రభావం చూపకూడదని చెప్పారు.





