News

మమతా బెనర్జీ పరిపాలనపై విమర్శలు గుప్పించిన తృణమూల్ ఎంపీ

609views

కోల్‌క‌తా: మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో మహిళలపై నేరాలు జరగడం సిగ్గుచేటు అని టీఎంసీ ఎంపీ సౌగత రాయ్ అన్నారు. మహిళలపై నేరాలు జరుగుతుండటం పట్ల అందరికీ ఆవేదన ఉందని చెప్పారు. దీనికి కారణం మీడియా అని తాను చెప్పలేనన్నారు.

మహిళలపై నేరాలను మనం ఎంత మాత్రం సహించకూడదని చెప్పారు. ఏదైనా సంఘటన జరిగితే, వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. ఓ మహిళ ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై నేరం జరిగితే, మనందరికీ సిగ్గుచేటేనని చెప్పారు. ఈ యథార్థాన్ని పోలీసులు, అధికారులు దృష్టిలో ఉంచుకోవాలన్నారు.

నాదియా జిల్లా, హన్స్‌ఖలీలో పద్నాలుగేళ్ళ బాలికపై ఈ నెల నాలుగోతేదీన‌ సామూహిక అత్యాచారం, హత్య జరిగినట్టు ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో సౌగత రాయ్ ఈ వ్యాఖ్యలు చేశారు. తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఏప్రిల్ నాలుగున బ్రజగోపాల్ గయలి పుట్టిన రోజు పార్టీకి హాజరైనపుడు సామూహిక అత్యాచారానికి గురైంది. ఆ మర్నాడు ఆమె తీవ్ర రక్తస్రావంతో మరణించినట్లు ఆమె కుటుంబ సభ్యులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి