
-
7 రోజులపాటు వేడుకలు, ఏకాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు
తిరుపతి: తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి తెప్పోత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. ఈ నెల 16వ తేదీ వరకు జరుగనున్నాయి. కొవిడ్-19 వ్యాప్తి నేపథ్యంలో పుష్కరిణిలో కాకుండా ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తున్నారు.
మొదటిరోజు శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారు తెప్పలపై విహరించడం ఆనవాయితీ. తెప్పోత్సవాలు ఏకాంతం కావడంతో తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామివారి ఉత్సవమూర్తులకు ఉదయం వేడుకగా స్నపనతిరుమంజనం నిర్వహించారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకం చేపట్టారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో శుక్రవారం నుండి తెప్పోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తారు. రెండో రోజు శ్రీ పార్థసారథిస్వామి వారు, మూడో రోజు శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారు, నాలుగో రోజు ఆండాళ్ అమ్మవారితో కలిసి శ్రీకృష్ణస్వామివారు, చివరి మూడు రోజులు శ్రీ గోవిందరాజ స్వామి వారిని వేంచేపు చేసి ఆలయంలో ఏకాంతంగా తెప్పోత్సవాలు నిర్వహిస్తారు.





