
533views
తిరుచానూరు: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 8న ఏకాంతంగా జరుగనున్న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏకాంతంగా జరిగింది.
ఇందులో భాగంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు. ఈ ఆలయానికి అనుబంధంగా ఉన్న సూర్యనారాయణస్వామివారి ఆలయంలోనూ ఉదయం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు.





