News

నీళ్ళు కావాలని అడిగారు… ఇవ్వలేకపోయా…

653views
  • కన్నీరుమున్నీరైన హెలికాప్టర్‌ ఘటన ప్రత్యక్ష సాక్షి

చెన్నై: హెలికాప్టర్‌ ప్రమాదంలో చిక్కుకొని తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడుతున్న బిపిన్‌ రావత్‌ తనను నీళ్ళు కావాలని అడిగారని శివకుమార్‌ అనే వ్యక్తి మీడియాకు తెలిపారు. అయితే, ఏటవాలు ప్రాంతంలో ఆయన పడి ఉండడంతో సత్వరం రక్షించేందుకు వీలు కాలేదని చెప్పారు. ఆయన అంత పెద్ద మనిషి అని అప్పుడు తెలియలేదని.. ఆ తర్వాత ఎవరో ఫొటో చూపించినప్పుడు తెలిసిందని కన్నీరుమున్నీరయ్యారు. తలుచుకుంటే బాధనిపిస్తోందని, ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. శివకుమార్‌ స్థానిక కాంట్రాక్టరు. చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ రావత్‌ దంపతులు సహా 13 మందిని బలిగొన్న హెలికాప్టర్‌ ప్రమాదానికి ఆయన ప్రత్యక్ష సాక్షి.

‘వేరే పని కోసం నేను రోడ్డుపై నడిచి వెళుతుండగా పలువురు హెలికాప్టర్‌ కూలిందని కేకలుపెట్టారు. వారితోపాటు నేనూ ఆ ప్రాంతానికి వెళ్ళాను. చెట్టును ఢీకొన్న హెలికాప్టర్‌ నుంచి మంటలు వస్తున్నాయి. అక్కడ ముగ్గురు కొనఊపిరితో అల్లాడిపోవడం కనిపించింది. వారిలో ఒకరు తనను కాపాడాలని వేడుకుంటూ, మంచి నీళ్ళు ఇవ్వాలని సైగలు చేశారు. చుట్టూ పొదలు ఉండడంతో వెంటనే దగ్గరకు వెళ్ళ లేకపోయాను.

ఇంతలో భద్రతా దళాలు అక్కడకు చేరుకుని ఆయనను, మరొకరిని దుప్పట్లలో చుట్టి అక్కడినుంచి తీసుకుపోయాయి. ఆ తరువాత తెలిసింది… ఆయనే బిపిన్‌ రావత్‌ అని’’ అని శివకుమార్‌ పేర్కొన్నారు. కాగా, బిపిన్‌ రావత్‌ చివరి క్షణాల్లో హిందీలో మాట్లాడారని, ‘నేనే బిపిన్‌ రావత్‌ని’ అంటూ నెమ్మదిగా పలికారని సహాయక చర్యల్లో పాల్గొన్న అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. అవే ఆయన చివరి మాటలు!

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి