
ఇస్లామాబాద్: ట్రైన్ డ్రైవర్(లోకోపైలట్) పెరుగు కొనుక్కోడానికి ట్రైన్ను ఆపేసి వార్తల్లో నిలిచాడు. లోకోమోటివ్ డ్రైవర్ పెరుగు కొనడానికి రైలును ఆపి ఇప్పుడు ఇబ్బందుల్లో పడ్డాడు. ఆ సమయంలో కొందరు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడంతో.. వీడియో కాస్తా వైరల్గా మారింది. ఇది ఉన్నతాధికారుల వరకూ వెళ్లడంతో అతడిని సస్పెండ్ చేశారు. లాహోర్ నుండి కరాచీ వైపు వెళ్లే ఇంటర్-సిటీ రైలు కహ్నా రైల్వే స్టేషన్ సమీపంలోకి వెళ్లే మార్గంలో ఆగింది. వైరల్ అవుతున్న వీడియోలో లోకోమోటివ్ డ్రైవర్ అందరినీ ఆశ్చర్యపరిచే విధంగా పెరుగు కొనుగోలు చేసిన తర్వాత ప్లాస్టిక్ బ్యాగ్ని తీసుకుని ఇంజిన్ దగ్గరకు తిరిగి వెళ్లడం కనిపించింది.
ఈ సంఘటన ఆ దేశంలో రైల్వేల భద్రత, నియంత్రణ గురించి ప్రశ్నలను లేవనెత్తింది. ఇటీవల అనేక ప్రమాదాలు చోటు చేసుకోవడంతో నిర్వహణా లోపం కారణంగా చాలా విమర్శలు వచ్చాయి. “ఇలా ట్రైన్ లను ఎక్కడ పడితే అక్కడ ఆపినప్పుడు అది భద్రతా సమస్యగా మారుతుంది. భద్రత మా ప్రాధాన్యత. భద్రతకు విఘాతం కలిగించే దేన్నీ మేము సహించలేము” అని రైల్వే మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి సయ్యద్ ఇజాజ్-ఉల్-హసన్ షా మీడియాకి చెప్పారు.
వీడియో వైరల్ కావడంతో, ఫెడరల్ రైల్వే మంత్రి అజం ఖాన్ స్వాతి కూడా ఈ విషయంపై సీరియస్ అయ్యారు. షెడ్యూల్ చేయని ప్రదేశంలో ఆగినందుకు రైలు డ్రైవర్, అతని సహాయకుడిని సస్పెండ్ చేసినట్టు డాన్ పత్రిక నివేదించింది. డ్రైవర్ రానా మొహమ్మద్ షెజాద్, అతని సహాయకుడు ఇఫ్తికార్ హుస్సేన్లను సస్పెండ్ చేయాలని పాకిస్తాన్ రైల్వేస్ లాహోర్ మేనేజ్మెంట్ ను ఆదేశించారు. ఎవరైనా జాతీయ ఆస్తులను వ్యక్తిగత అవసరాల కోసం ఉపయోగించడాన్ని అనుమతించనని మంత్రి తాజా ప్రకటనలో హెచ్చరించారు.
Source: NationalistHub





