
-
అంచనా వేసిన అంతర్జాతీయ సంస్థ
న్యూఢిల్లీ: 2022-23 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధి రేటు 60 బేసిస్ పాయింట్లు మేర పెరగనున్నట్టు మోర్గాన్ స్టాన్లీ అంచనావేసింది. అన్ని రంగాల్లో వినియోగం పుంజుకునే అవకాశం ఉన్నందున 7.8 శాతం వృద్ధి రేటు నమోదుకావచ్చని పేర్కొంది. ‘దేశంలో అర్హులైన ప్రజలందరికీ కొవిడ్-19 టీకా వేయడం 2022 జనవరి- మార్చిలో పూర్తయ్యే అవకాశం ఉంది. వస్తు, సేవా రంగాల్లో వినియోగం పుంజుకునేందుకు ఇది తోడ్పడుతుంద’ని మోర్గాన్స్టాన్లీ అభిప్రాయపడింది. 2022 రెండో అర్ధభాగం నుంచి ప్రైవేట్ రంగ మూలధన వ్యయాలు పెరిగే అవకాశం ఉందని సంస్థ తెలిపింది.
సామర్థ్య వినియోగం మెరుగవ్వడం, ఆర్థిక కార్యకలాపాలు సాధారణ స్థితికి రావడం, సంస్కరణలు ఇందుకు దోహదం చేస్తాయని తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 10.3 శాతం లభించవచ్చన్నది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంచనా (9.5%) కంటే ఇది ఎక్కువ. 2023-24 ఆర్థిక సంవత్సరానికి భారత వృద్ధిరేటు 7.2 శాతంగా నమోదుకావచ్చని సంస్థ అంచనా వేస్తోంది.





