
న్యూఢిల్లీ: హైపర్సోనిక్ ఆయుధాలను అభివృద్ధి చేస్తున్న అతికొద్ది దేశాల సరసన భారత్ కూడా చేరింది. ఈ విషయాన్ని అమెరికా కాంగ్రెస్ ఓ నివేదిక పేర్కొంది. ఈ సాంకేతికత కోసం రష్యాతో చేతులు కలిపిందని తెలిపిందని పేర్కొంది. ధ్వని కన్నా అనేక రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే హైపర్సోనిక్ ఆయుధాలు పనిచేస్తాయి. అణ్వస్త్ర సామర్థ్యమున్న హైపర్సోనిక్ క్షిపణిని చైనా పరీక్షించినట్టు ఇటీవల వార్తలు వచ్చిన నేపథ్యంలో ఈ అంశానికి ప్రాధాన్యం ఏర్పడింది. స్వతంత్రంగా వ్యవహరించే కాంగ్రెస్ పరిశోధన సర్వీస్ (సీఆర్ఎస్) ఈ నివేదికను రూపొందించింది. హైపర్సోనిక్ అస్త్రాల విషయంలో అమెరికా, రష్యా, చైనాలు ముందంజలో ఉన్నాయి. ఆస్ట్రేలియా, భారత్, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ దేశాలూ ఈ తరహా పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తున్నాయి.ఈ సాంకేతికత కోసం ఆస్ట్రేలియా.. అమెరికాతో భాగస్వామ్యం వహిస్తోంది. భారత్ మాత్రం రష్యాతో చేయి కలిపింది. ధ్వనితో పోలిస్తే 7 రెట్లు ఎక్కువ వేగంతో దూసుకెళ్లే బ్రహ్మోస్-2 హైపర్సోనిక్ క్రూజ్ క్షిపణి కోసం భారత్, రష్యా సంయుక్తంగా కసరత్తు చేస్తున్నాయి.
Source: EtvBharat





