News

ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు!

481views
  • ఎన్‌సీబీ ఆరోపణ

ముంబై: బాలీవుడ్‌ బాద్‌షా షారూఖ్‌ ఖాన్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌కు అంతర్జాతీయ డ్రగ్స్‌ రాకెట్లతో లింకులు ఉన్నాయని మాదకద్రవ్యాల నియంత్రణ విభాగం(ఎన్‌సీబీ) ఆరోపించింది. ‘మత్తు’ పార్టీ నిర్వహిస్తున్న నౌక కార్డెలియా క్రూయిజ్‌ ఎంప్రెసపై దాడుల కేసుకు సంబంధించి ముంబై అదనపు ప్రధాన మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టులో ఎన్‌సీబీ తరఫున అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌సింగ్‌ ఈ మేరకు వాదనలు వినిపించారు.

ఇదిలావుండగా, ‘‘నిందితుల అరెస్టు సమయంలో వారి వద్ద కమర్షియల్‌ స్థాయిలో మాదకద్రవ్యాలు లభించాయి. ఆర్యన్‌ వద్ద సీజ్‌ చేసిన మొబైల్‌ఫోన్‌ విశ్లేషణ సందర్భంగా.. నాలుగేళ్ల వాట్సాప్‌ చాటింగ్‌ సంభాషణలను గుర్తించాం. అందులో డ్రగ్స్‌ డీలింగ్స్‌కు సంబంధించి, నగదు బదిలీపై కోడ్‌ భాషలో సంభాషణలు ఉన్నాయి.’ అని తెలిపారు.

పైగా, ఈ కేసులో పలు చోట్ల ఎన్‌సీబీ రైడ్స్‌ కొనసాగుతున్నాయని, ఈ నేపథ్యంలో ఆర్యన్‌, ఇతర నిందితుల నుంచి మరింత సమాచారం సేకరించాల్సి ఉందని చెప్పారు. వారిని విచారించి డ్రగ్స్‌ రాకెట్లకు సంబంధించిన లింకులు, చైన్‌ను గుర్తించాల్సి ఉందని కోర్టుకు తెలిపారు.

అయితే, ఆర్యన్‌ తరఫున వాదనలు వినిపించిన న్యాయవాది సతీశ్‌ మనెషిండే ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ‘ఆ పార్టీకి ఆర్యన్‌ కేవలం ప్రత్యేక ఆహ్వానితుడిగా వెళ్లారు. ఎన్‌సీబీ దాడుల సమయంలో ఆర్యన్‌ వద్ద ఎలాంటి మత్తుపదార్థాలు లభించలేదు. ఇప్పటి వరకు ఆర్యన్‌ ఎన్‌సీబీ విచారణకు పూర్తిస్థాయిలో సహకరించారు. ఇంకా అతని కస్టడీ పొడిగింపు అవసరం లేదు’ అని తెలిపారు.

ఇక వాట్సాప్‌ చాటింగ్‌ విషయానికి వస్తే.. ‘ఆర్యన్‌ ఎక్కువ కాలం విదేశాల్లోనే ఉన్నారు. అవి సాధారణంగా అక్కడి మిత్రులతో జరిపిన చాటింగ్‌లే తప్ప.. డ్రగ్స్‌ రాకెట్లతో ఎలాంటి సంబంధం లేదు. విదేశాల్లో ఉన్నప్పుడు ఎన్నడూ డ్రగ్స్‌ తీసుకోలేదు’ అని వివరించారు.

దాంతో న్యాయమూర్తి.. ఎవరెవరి వద్ద ఎంత మొత్తంలో డ్రగ్స్‌ దొరికాయని ప్రశ్నించారు. దానికి అనిల్‌ సింగ్‌ సమాధానమిస్తూ.. ‘అర్బాజ్‌ మర్చంట్‌ వద్ద ఆరు గ్రాముల చరాస్‌, మున్మున్‌ వద్ద ఐదు గ్రాముల మాదకద్రవ్యాలు దొరికాయి. మరో నిందితుడి(ఆర్యన్‌ అని చెప్పకుండా..) వద్ద ఐదు గ్రాముల ఎండీఎంఏ లభించింది’ అని వివరించారు.

ఇరుపక్షాల వాదోపవాదాలు విన్న న్యాయమూర్తి.. ఆర్యన్‌, మిగతా ఇద్దరు నిందితులను మూడు రోజుల పాటు ఎన్‌సీబీ కస్టడీకి అనుమతించారు. ఆదివారం అరెస్టు చూపిన మరో ఐదుగురు నిందితులు… నుపుర్‌ సాతిజ, ఇస్మీత్‌ సింగ్‌, మోహక్‌ జైస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రాను కోర్టులో హాజరుపరిచారు. ఈ పార్టీకి డ్రగ్స్‌ సరఫరా చేసిన ముంబైకి చెందిన ఓ వ్యక్తిని కూడా న్యాయమూర్తి ముందు నిలబెట్టారు.

Source: Nijamtoday

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి