
-
కర్ణాటక అసెంబ్లీలో హోసదుర్గ్ ఎమ్మెల్యే శేఖర్ ఆగ్రహం
-
చర్యలకు రాష్ట్ర హోం మంత్రి హామీ
బెంగళూరు: క్రిస్టియన్ మిషనరీలు నా తల్లినీ మతం మార్చాయి… ఆమె నుదిటిపై కుంకుమ పూయవద్దని కోరింది. నా తల్లి మొబైల్ ఫోన్ రింగ్టోన్ కూడా క్రైస్తవ ప్రార్థనగా మారిపోయిందంటే, పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని ఎమ్మెల్యే శేఖర్ మిషనరీల చర్యలపై అసెంబ్లీలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
హోసదుర్గ్ అసెంబ్లీ నియోజకవర్గంలో క్రిస్టియన్ మిషనరీలు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నాయని, తక్షణం మిషనరీలపై చర్య తీసుకోవాలని ఆ ప్రాంత ఎమ్మెల్యే గూలిహట్టి శేఖర్ కర్ణాటక శాసనసభలో డిమాండ్ చేశారు. ఈ నియోజకవర్గంలో యథేచ్ఛగా మత మార్పిడికి పాల్పడుతున్నాయని ఆరోపించారు. 18 నుండి 20 వేల మందిని క్రైస్తవులుగా మార్చాయని దుమ్మెత్తిపోశారు.
ఇంట్లో పూజ చేయడం మాకు కష్టంగా ఉంది. మాకు పెద్ద సమస్య తలెత్తింది. మేము నా తల్లికి ఏదైనా చెప్పడానికి ప్రయత్నిస్తే, తాను చనిపోతానని హెచ్చరించిందని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ప్రాంతంలో పనిచేస్తున్న క్రైస్తవ మిషనరీలు ప్రార్థనల కోసం తన తల్లిని సంప్రదించినట్టు బీజేపీ ఎమ్మెల్యే చెప్పారు. అప్పుడు ఆమెకు మంచిగా అనిపించడంతో వారి వలలో పడిపోయిందని చెప్పారు. ఇప్పుడు ఆమె ఇంట్లో హిందూ దేవతలు, దేవతల చిత్రాలను, పూజ ఇంట్లో ఉంచిన వస్తువులను కూడా చూడాలనుకోవడం లేదన్నారు.
క్రిస్టియన్ మిషనరీల చర్యలను అడ్డుకున్నవారిపై అత్యాచారం, హింస వంటి తప్పుడు కేసులను క్రైస్తవులు బనాయిస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. మిషనరీలను అరికట్టడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని గూలిహట్టి కోరారు. ఈ సమస్యపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని రాష్ట్ర హోం మంత్రి అరగా జనేంద్ర అన్నారు. అత్యాశతో ఒకరిని వేరే మతంలోకి మార్చుకోవడం నేరమని ఆయన అన్నారు.
Source: Samvadkarnataka





