
-
300 మంది తోడు లేకుండా ఇతర దేశాలకు వలస
ఐక్యరాజ్యసమితి: తాలిబన్లు క్రూరత్వంతో వశం చేసుకున్న ఆఫ్ఘనిస్తాన్లోని పిల్లల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది. అక్కడి బాలలపై ఐక్యరాజ్య సమితి ఒక సంచలన ప్రకటన చేసింది. అప్ఘనిస్తాన్కు చెందిన పిల్లలు ఇతర దేశాలకు వలస పోయినట్టు తెలిపింది. అయితే, వారితో కనీసం ఒక్కరు కూడా తోడుగా లేరని లోకానికి చెప్పింది.
వారు తల్లిదండ్రులను, బంధువులను వదిలిపెట్టి ఇతర దేశాలకు వెళ్ళినట్టు యూనిసెఫ్ ప్రకటనలో పేర్కొనడం ఆందోళన కలిగించే అంశం. తాలిబన్లకు భయపడి లక్షలాది మంది దేశం విడిచి ఇతర దేశాలకు వలసపోయిన సమయంలో తాము చనిపోయినా పర్వాలేదు… తమ పిల్లలు క్షేమంగా ఉండాలని భావించి, పిల్లలను అక్కడున్న అమెరికా సైనికుల చేతుల్లో పెట్టారు. ఇంకా విమానాల్లో వలసపోయినప్పుడు పిల్లలు కూడా ఉన్నారు. ఆగస్టు 14 నుంచి దాదాపు 300 మంది చిన్నారులు ఇతర దేశాలకు వెళ్లినట్లు యూనిసెఫ్ ప్రకటించింది.
వారంతా జర్మనీ, తదితర దేశాలకు వెళ్లినట్టు తెలిపింది. వారి యోగ క్షేమాలు చూడాల్సిందిగా ఆయా దేశాలను యుఎన్ కోరింది. తమ సభ్యులు ఆయా దేశాల్లోని ఎయిర్ పోర్టులో పిల్లల వివరాలు సేకరిస్తున్నామని యూనిసెఫ్ తెలిపింది. తల్లిదండ్రులు, బంధువులు లేక పిల్లలు అవస్థలు పడుతూ ఉంటారని ఆవేదన వ్యక్తం చేసింది. బంధువులు దగ్గర ఉన్న పిల్లలను ఎవరూ దూరం పెట్టొద్దని యూనిసెఫ్ అభ్యర్థించింది. వారు ఇప్పటికే ఇబ్బందుల్లో ఉన్నారని సూచించింది.
Source : News18





