జపాన్లో జలప్రళయాన్ని తలపించే రీతిలో వర్షాలు… వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా నీటమునిగిన ప్రధాన నగరాలు.. హై అలర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

జపాన్లో అతి భారీ వర్షాలు, వరదలు విధ్వంసాన్ని సృష్టిస్తున్నాయి. హిరోషిమా సహా ఎనిమిది.. ప్రధాన నగరాల్లో జపాన్ వాతావరణ విభాగం హై ఎలర్ట్ ను జారీ చేసింది. కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల వరదలు, కొండచరియలు విరిగిపడడం వంటి పరిస్థితులు ఏర్పడవచ్చునని దీంతో ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించే అవకాశం కూడా ఉండకపోవచ్చునని హెచ్చరించింది.
వాయవ్య జపాన్లోని సాగా, నాగసాకి, ఫుకోకా రాష్ట్రాల్లో ఐదవ నెంబరు ప్రత్యేక ప్రమాద వాతావరణ హెచ్చరికను జారీ చేసింది. ఈ ప్రాంతంలో పలు నదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్నాయి. హిరోషిమా నగరంలో కూడా ఇదే హెచ్చరికను జారీ చేశారు. అన్ని ప్రధాన నదులకు వరద నీరు పొటెత్తుతోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడం కూడా అధికారులకు సాధ్యం కావడం లేదు. గత వందేళ్లలో ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీ వర్షాలు ప్రజా జీవనం స్తంభించింది. అసలు అక్కడ ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొంది.

అటు ప్రజలు కూడా తమ ప్రాణాలు కాపాడుకునేందుకు ఇళ్ల పైకప్పులకు చేరుకున్నారు. తమ జీవితాలు కాపాడమని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. దాదాపు పది లక్షల మంది ప్రజలు సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలు వీలైనంత త్వరగా ఇళ్లు ఖాళీ చేయాలని జపాన్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అటు వరద నీటితో భారీగా బురద కూడా వస్తోంది. బురద కారణంగా ఇప్పటికే పది మందికి పైగా మృతి చెందినట్లు తెలుస్తోంది. రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి.





