News

గుప్త నిధుల పేరుతో నంది విగ్రహం చోరీ.. కేసును చేధించిన పోలీసులు.. నిందితులంతా ఉన్నత విద్యావంతులే…

826views

తూర్పు గోదావరి జిల్లా… బిక్కవోలు మండలం, బిక్కవోలు గ్రామంలోని గోలింగేశ్వర స్వామి ఆలయంలో పురాతన నంది విగ్రహం చోరీ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన విషయం తెలిసిందే. ఈ నెల 6వ తేదీన నంది విగ్రహం అపహరణకు గురవగా.. తాజాగా పోలీసులు ఈ కేసును చేధించారు. నలుగురు నిందితులు ఈ విగ్రహాన్ని దొంగిలించినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో ఇద్దరిని అదుపులోకి తీసుకోగా.. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. కాగా, ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. నంది విగ్రహాన్ని దొంగిలించిన దుండగులు నలుగురూ.. ఉన్నత చదువులు చదువుకున్న వారు కావడం విశేషం. ఆర్ధిక ఇబ్బందులకు తోడు మూఢ నమ్మకాల నేపథ్యంలో.. పురాతన విగ్రహాలలో విలువైన వజ్రాలు వుంటాయనే ఆశ పడ్డారు. ఈ ఆశతోనే గత కొంత కాలంగా రెండు తెలుగు రాష్ట్రాలలో అనేక చారిత్రాత్మక పురాతన దేవాలయాలకు ప్రత్యక్షంగా వెళ్లి రెక్కి నిర్వహించారు. కాగా, చోరికి రెండు రోజుల ముందు నిందితులైన చుక్కపట్ల ప్రసాద్, గువ్వల భాస్కర రెడ్డి, కుంచాల వెంకటేష్, రవి పంతులు కారులో వచ్చి బిక్కవోలు ఆలయంలో రెక్కీ నిర్వహించారు. దీని ప్రకారం.. ప్రణాళికలు సిద్ధం చేసుకుని 6వ తేదీన అర్థరాత్రి దాటిన తరువాత గుడిలోకి చొరబడ్డారు. తమ కారును గుడి వెనుకవైపు నిలిపి.. ఆలయ ప్రహరి గోడను దూకి లోనికి ప్రవేశించారు. అతిపురాతనమైన నంది విగ్రహాన్ని దొంగిలించుకుని వెళ్లిపోయారు. జి మామిడాడ మార్గంలో వెళుతూ.. వారితో పాటు తెచ్చుకున్న సుత్తితో నంది విగ్రహాన్ని పగులగొట్టారు. అందులో విలువైనవి ఏమీ లేకపోవడంతో.. పగిలిగిన విగ్రహం రాతి ముక్కలను రోడ్డు పక్కనే ఉన్న పొదలలో పడేశారు. అటు నుంచి గుంటూరుకు వెళ్లిపోయారు.

నిందితులు ఇచ్చిన వాంగ్మూలం ప్రకారం.. జి మామిడాడ లో నరసారావుపేట రోడ్డు పక్కన పొదలలో పడేసిన నంది విగ్రహం శకలాలు, చోరీకి ఉపయోగించిన కారును పోలీసులు సీజ్ చేశారు. అయితే, ఈ కేసులో ప్రసాద్, వెంకటేష్‌ను అరెస్ట్ చేయగా.. భాస్కర రెడ్డి, రవి పంతులు పరారీలో ఉన్నారు. వీరి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చేపడుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.