భారతీయ కమ్యూనిస్టుల చైనా దేశభక్తి .. చైనా కమ్యూనిస్ట్ పార్టీ శతజయంతి ఆన్లైన్ సమావేశంలో పాల్గొన్న అగ్రనాయకులు

చైనా రాయబార కార్యాలయం నిర్వహించిన ఆన్లైన్ సెమినార్లో మన దేశంలోని వామపక్ష నాయకులు పాల్గొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ శత జయంత్యుత్సవాలను పురస్కరించుకొని ఆ దేశ రాయబార కార్యాలయం మంగళవారం ఏర్పాటు చేసిన సెమినార్లో సీతారాం ఏచూరి (సీపీఎం), డి.రాజా (సీపీఐ), డీఎంకే ఎంపీ సెంథిల్ కుమార్, ఫార్వర్డ్ బ్లాక్ కు చెందిన దేవరాజన్ తదితరులు పాల్గొన్నారు. చైనాతో సరిహద్దు ఘర్షణ జరుగుతున్న సమయంలో వామపక్షాలు ఈ సెమినార్ కు హాజరు కావడంపై భాజపా పశ్చిమబెంగాల్ అధ్యక్షుడు, ఎంపీ దిలీప్ ఘోష్ మండిపడ్డారు. కమ్యూనిస్టు ఉద్యమాలను తాను చాలా కాలం నుంచి గమనిస్తున్నానని, వారు ఎప్పుడూ భారత్ కు వ్యతిరేకంగానే పనిచేశారని పేర్కొన్నారు. చైనా ఛైర్మన్ ను తమ ఛైర్మన్ గా భారత్లోని కమ్యూనిస్టులు భావిస్తారని అన్నారు. భారత్లోని కమ్యూనిస్టులకు దేశ ప్రయోజనాల కంటే చైనా అంటేనే అమిత ప్రేమ అని బీజేపీ ఆరోపించింది.





