
హరియాణా అంబాలా రేంజ్లో ఇన్స్పెక్టర్ జనరల్గా విధులు నిర్వహిస్తున్న సీనియర్ ఐపీఎస్ అధికారిణి భారతి అరోరా స్వచ్ఛంద పదవీ విరమణ ప్రకటన అందరిని ఆశ్చర్యపరిచింది. దీనిపై ఆమె స్పందిస్తూ..
“ఇప్పుడు నేను జీవిత అంతిమ లక్ష్యాన్ని సాధించాలనుకుంటున్నాను. పవిత్ర సాధువులైన గురు నానక్ దేవ్, చైతన్య మహాప్రభు, కబీర్దాస్, తులసీదాస్, సుర్దాస్, మీరాబాయి, సూఫీ సాధువులు చూపిన మార్గంలో జీవించాలనుకుంటున్నాను. శ్రీకృష్ణుడి సేవకు నా జీవితాంతం అంకితం చేయాలని నేను ఆరాటపడుతున్నాను’’ అని తెలిపారు భారతి అరోరా. ఇక దీనిపై ఫోన్ ద్వారా భారతి అరోరా పీటీఐతో మాట్లాడుతూ, ‘‘నా ఉద్యోగం అంటే నాకు ఎంతో గౌరవం, ఆసక్తి. ఇప్పటికే 23 ఏళ్లుగా విధులు నిర్వహించాను. ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించాలనుకుంటున్నాను. అందుకే ఉద్యోగం నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని భావిస్తున్నాను’’ అని తెలిపారు. భారతి అరోరా 2007 సంజౌతా ఎక్స్ప్రెస్ పేలుడు కేసును దర్యాప్తు చేశారు. అప్పుడు ఆమె పోలీసు సూపరింటెండెంట్గా (రైల్వే) విధులు నిర్వహించారు. పోలీసు పరిపాలన పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఆమెను ఏప్రిల్ 2021 లో కర్నాల్ నుంచి అంబాలా రేంజ్కు బదిలీ చేశారు.





