
యూరియా మినహా ఇతర ఎరువుల ధరలను పెంచొద్దని ఎరువుల కంపెనీలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డీఏపీ, ఎంవోపీ, ఎన్పీకేలకు ప్రస్తుతం ఉన్న ధరల్నే కొనసాగించాలని ఆదేశిస్తూ కంపెనీలకు ఉత్తర్వులు పంపింది. ఎరువుల ధరలు పెంచనున్నామన్న కంపెనీల ప్రకటన తర్వాత రైతుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. దీంతో అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ధరలు ఎలాంటి మార్పులు చేయొద్దని నిర్ణయించింది.
నిజానికి పెట్రోల్, డీజిల్ ధరల్లాగే ఎరువుల ధరలు కూడా అంతర్జాతీయ మార్కెట్ల పోకడలకు అనుగుణంగా మారుతూ ఉంటాయి. కేంద్రం రైతులకు రాయితీ కల్పిస్తూ.. ఆ మొత్తాన్ని ఎరువుల కంపెనీలకు చెల్లిస్తుంది.
”డీఏపీ, ఎంఓపీ, ఎన్పీకేలను రైతులు పాత ధరలకే పొందనున్నారు. రైతుల ప్రయోజనాలకే తొలి ప్రాధాన్యం ఇస్తూ.. ఎరువుల ధరలు పెరగవని ప్రకటిస్తున్నాం” అని సమావేశం అనంతరం కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ట్వీట్ చేశారు.
ఖరీఫ్ సీజన్ ఆరంభానికి ముందే డీఏపీ, కాంప్లెక్స్ ఎరువుల ధరలను పెంచాలని కంపెనీలు నిర్ణయించాయి. ఈ మేరకు టోకు వ్యాపారులకు సమాచారం అందింది. పెంపు సుమారు 58% ఉండటంతో అన్నింటి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉందని అన్నదాతల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజా ఆదేశాలు జారీ చేసింది.





