
ఇస్లాం మతాన్ని కించపరుస్తూ మాట్లాడాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ వ్యక్తిని కోర్టు ఆవరణలోనే కిరాతకంగా చంపేసిన ఘటన పాకిస్థాన్ లో జరిగింది. దైవదూషణ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తాహిర్ షమీమ్ అనే ముస్లిం యువకుడు బుధవారం విచారణ నిమిత్తం పెషావర్ సిటీలోని కోర్టుకు హాజరయ్యాడు. ఈ క్రమంలో ఖలీద్ ఖాన్ అనే యువకుడు పోలీసుల కళ్లు గప్పి తుపాకీతో కోర్టు లోనికి ప్రవేశించాడు. అనంతరం అదును చూసి తాహిర్పై కోర్టు గదిలోనే కాల్పులు జరిపి దారుణంగా హతమార్చాడు.
దీంతో షాక్ తిన్న పోలీసులు వెంటనే అతడిని అరెస్ట్ చేశారు. మరోవైపు బాధితుడిని ఆసుపత్రికి తరలించేలోగా ప్రాణాలు విడిచాడు. తాహిర్ రెండేళ్ల క్రితం దైవ దూషణ చేసినట్లు కేసు నమోదైందని అక్కడి పోలీసు అధికారి అజ్మత్ ఖాన్ వెల్లడించారు. కాగా పాకిస్థాన్లో దైవదూషణను ఘోర నేరంగా పరిగణిస్తారు. దైవదూషణ చేసినట్లు రుజువైతే వారికి జీవిత ఖైదు లేదా మరణ శిక్ష విధిస్తారు. అయితే మైనారిటీలను బెదిరించేందుకు, వ్యక్తిగత కక్షలు సాధించేందుకు దైవదూషణ ఆరోపణలను పాకిస్థాన్ లో ఒక అస్త్రంగా ఉపయోగిస్తారని పాకిస్తానీ, అంతర్జాతీయ మానవ హక్కుల కార్యకర్తలు చెప్పుకొస్తున్నారు.





