
కరోనా వైరస్ మహమ్మారికి పుట్టినిల్లు చైనాలో వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. గత కొన్నిరోజులుగా పదుల సంఖ్యలో కొవిడ్ కేసులు నమోదవుతుండగా తాజాగా ఒకేరోజు 100పైగా పాజిటివ్ కేసులు బయటపడ్డాయి. వీటిలో కేవలం షిన్జియాంగ్ ప్రాంతంలోనే 89కేసులు నమోదయ్యాయి. గడిచిన మూడు నెలల కాలంలో ఒకేరోజు ఇన్ని కేసులు నమోదుకావడం ఇదే తొలిసారి. ఏప్రిల్ 13న ఒకేరోజు 108కేసులు నమోదయ్యాయి. అనంతరం రోజువారి కేసుల సంఖ్య 100 దాటలేదు. గత ఏడునెలల క్రితం మొదలైన వైరస్ విజృంభణ చైనాలో చాలా ప్రాంతాల్లో ఇంకా కొనసాగుతూనే ఉంది. దీంతో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో లాక్డౌన్ విధిస్తున్నారు. కేసులు బయటపడుతున్నచోట కఠిన ఆంక్షలు అమలుచేయడంతోపాటు భారీ స్థాయిలో కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేపడుతున్నారు. ఒక్క బీజింగ్లోనే దాదాపు 10లక్షల పరీక్షలు నిర్వహించినట్లు సమాచారం. ఇక డాలియన్, ఝావోలైన్ నగరాల్లోనూ దాదాపు 30లక్షల కొవిడ్ పరీక్షలు చేపట్టినట్లు అక్కడి మీడియా పేర్కొంది.
ఇదిలా ఉంటే, ఇప్పటివరకు చైనాలో 84,060 పాజిటివ్ కేసులు నమోదుకాగా 4,634 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రపంచవ్యాప్తంగా కోటి 67లక్షల మందికి వైరస్ సోకగా వీరిలో 6లక్షల 60వేల మంది మృత్యువాతపడ్డారు.





