News

కోవిడ్ – 19 పై రాష్ట్రాలకు కేంద్రం మార్గదర్శకాలు

772views

దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తున్న నేపథ్యంలో మరింత పటిష్ఠ చర్యలు చేపట్టాలని రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న కేంద్ర హోంశాఖ తాజాగా రాష్ట్రాలకు స్పష్టమైన మార్గదర్శకాలను జారీ చేసింది. పలు రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు, వర్కింగ్‌ ఉమెన్‌, ఇతరులు ప్రస్తుతం వారు ఉన్నచోటే ఉండేలా ఏర్పాట్లు చేయాలని, వారికి అవసరమైన సహకారం అందించాలని ఆదేశించింది. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లిన వ్యవసాయ కూలీలు, అసంఘటిత కార్మికులకు ఆశ్రయం కల్పించడంతో పాటు ఆహారం అందజేయాలని సూచించింది.

అవసరమైతే ప్రజాపంపిణీ వ్యవస్థను ఉపయోగించుకోవాలని దీనికోసం స్వచ్ఛంద, ఇతర సంస్థల సహకారం తీసుకుని శుద్ధమైన తాగునీరు, ఇతర నిత్యావసరాలు అందించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈవిధమైన జాగ్రత్త చర్యలతో ఆయా వర్గాలు ఒక ప్రదేశం నుంచి మరో చోటికి తరలివెళ్లడం ఆగుతుందని చెప్పింది. హాటళ్లు, హాస్టళ్లు, అద్దె వసతి గృహాలు కొనసాగించేలా చూడాలని సూచించింది. నిత్యావసరాలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఇచ్చిన మార్గదర్శకాల్లో పేర్కొంది. మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారిపట్ల చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, వారిని కట్టడి చేయగలిగితేనే కరోనా వ్యాప్తిని అడ్డుకోగలమని హోంశాఖ సూచించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.