
కరోనా వైరస్ వ్యాప్తిని నిరోధించేందుకు ప్రధాని మోడీ చేసిన లాక్డౌన్ ప్రకటన రికార్డులు తిరగరాసింది. ఇప్పటి వరకు అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన టెలివిజన్ ప్రసంగంగా నిలిచింది. 2016 నోట్ల రద్దు స్పీచ్ను ఇది అధిగమించినట్లు టీవీ రేటింగ్ ఏజెన్సీ బార్క్ ఇండియా వెల్లడించింది.
కొవిడ్-19పై పోరులో భాగంగా తొలుత జాతినుద్దేశించి ప్రసంగిస్తూ జనతా కర్ఫ్యూ విధిస్తున్నట్లు మోడీ ప్రకటించిన సంగతి తెలిసిందే. అనంతరం 24వ తేదీన మరోసారి జాతినుద్దేశించి ప్రసంగిస్తూ దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. దీన్ని అత్యధికంగా 19.7 కోట్ల మంది వీక్షించారని బార్క్ ఇండియా వెల్లడించింది. దీన్ని 201 ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయని ప్రసార భారతి సీఈవో శశి శేఖర్ ట్వీట్ చేశారు. గతంలో ఐపీఎల్ ఫైనల్ను అత్యధికంగా 13.3 కోట్ల మంది వీక్షించగా మోడీ ప్రసంగం దాన్ని అధిగమించింది.
అంతకుముందు జనతా కర్ఫ్యూనుద్దేశిస్తూ మార్చి 19న చేసిన ప్రసంగానికి 8.30 కోట్ల వ్యూస్ రాగా.. 191 ఛానళ్లు ప్రసారం చేశాయి. ఆర్టికల్ 370 రద్దు ప్రసంగాన్ని 163 ఛానళ్లు ప్రసారం చేయగా.. 6.5 కోట్ల మంది.. నోట్ల రద్దు ప్రసంగాన్ని 114 ఛానళ్లు ప్రసారం చేయగా.. 5.7 కోట్ల వీక్షణలు దక్కాయి.





