
మహారాష్ట్రలోని ఔరంగాబాద్లో రాజ్ ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎమ్ఎన్ఎస్) పార్టీ ఏర్పాటు చేసిన ఓ పోస్టర్ స్థానికంగా కలకలం రేపుతోంది. బంగ్లాదేశ్, పాకిస్థాన్కు చెందిన చొరబాటు దారుల గురించి కచ్చితమైన సమాచారం అందించిన వారికి రూ.5,000 బహుమతి ఇస్తామని అందులో ప్రకటించారు. దీనిపై ఎమ్ఎన్ఎస్ విద్యార్థి విభాగం నాయకుడు అఖిల్ చిత్రే మాట్లాడుతూ ”చొరబాటుదారుల గురించి సమాచారం అందించిన వారికి బహుమతిగా రూ.5 వేలు ఇస్తాం. అంతేకాకుండా వారి వివరాలను గోప్యంగా ఉంచుతాం” అని తెలిపారు. గతంలో కూడా బంగ్లాదేశీయులు దేశం విడిచి వెళ్లిపోవాలని లేకుంటే ఎమ్ఎన్ఎస్ విధానంలో వారిని పంపుతామని మహారాష్ట్ర వ్యాప్తంగా పోస్టర్లు వెలిశాయి. పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రధాని మోదీ నిర్ణయాన్ని సమర్థిస్తూ రాజ్ థాక్రే వ్యాఖ్యలు చేసిన తర్వాత ఈ పోస్టర్లు ఏర్పాటు కావడం గమనార్హం.
గతంలో ఎమ్ఎన్ఎస్ పేరుతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే నివాసం మాతోశ్రీ నివాసం ఎదుట కూడా పోస్టర్లు వెలిశాయి. ”మీరు అక్రమ చొరబాటుదారుల గురించి ఆందోళన చెందుతున్నట్లయితే ముందుగా మీ బాంద్రా ప్రాంతంలో ఉన్న చొరబాటుదారులను ఖాళీ చేయించండి” అనేది దాని సారాంశం. జాతీయ పౌర పట్టిక (ఎన్ఆర్సీ) వల్ల రాష్ట్రంలో ప్రజలు ఇబ్బందులకు గురవుతారని ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలను విమర్శిస్తూ వీటిని ఏర్పాటు చేశారు. అయితే సీఏఏ, ఎన్ఆర్సీ, ఎన్పీఆర్ గురించి ప్రధాని మోదీతో సమావేశం సందర్భంగా చర్చించినట్లు వాటి గురించి ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని ఉద్ధవ్ ఠాక్రే ప్రకటించడం గమనార్హం.





