
దేశరాజధానిలో ఇటీవల చోటుచేసుకున్న హింసాత్మక ఘటనలను విచారించేందుకు రెండు ప్రత్యేక దర్యాప్తు బృందాలను(సిట్) ఏర్పాటు చేశారు. ఘర్షణలకు సంబంధించిన ఢిల్లీ నేర విభాగ పరిధిలోని కేసులన్నింటినీ ఆ సిట్ బృందాలకు బదిలీ చేయనున్నారు. ఒక బృందానికి డీసీపీ రాజేశ్ దేవ్, మరో బృందానికి నేర విభాగం అదనపు సీపీ బీకే సింగ్ నేతృత్వం వహించనున్నారు. ఆ కేసులన్నింటినీ ఈ ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో దర్యాప్తు చేయనున్నట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి. ఈ అల్లర్లకు సంబంధించి ఇప్పటివరకూ 48 ఎఫ్ఐఆర్లు నమోదు కాగా 130 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈశాన్య ఢిల్లీలో ఆదివారం ఘర్షణలు మొదలైన విషయం తెలిసిందే. ఆందోళనకారులు రాళ్లు విసరడం, ఇళ్లను తగలబెట్టడానికి పాల్పడటంతో ఈ ఘర్షణలు హింసాత్మకంగా మారాయి. ఈక్రమంలో 35 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 200 మంది వరకు గాయాల పాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.





