
ఇరాన్ సుప్రీంలీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ తక్షణమే పదవి నుంచి దిగిపోవాలంటూ ఆ దేశంలో నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. తమకు స్వేచ్ఛ కావాలంటూ ప్రజలు రోడ్లపై నిరసన బాట మరింత ఉధృతంగా మారింది. గత వారం రోజులుగా చేస్తున్న వారి నిరసన అంతకంతకూ ప్రభుత్వంపై వ్యతిరేకతను చాటిచెబుతూ తీవ్రతరమయ్యింది. అమెరికా డాలర్తో ఇరానియన్ రియాల్ విలువ భారీగా పడిపోవడం, తద్వారా ధరలు ఎగబాకడం, జీవన వ్యయం పెరిగిపోవడం పట్ల జనం అసంతృప్తితో రగిలిపోతున్నారు. దేశవ్యాప్తంగా వీధుల్లోకి వచ్చి, ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. గత ఆరు రోజులుగా ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.
ఇది మరో ‘జెన్జీ’ కానుందా?
ఇది క్రమంగా జెన్జీ(Gen-Z) ఉద్యమంగా రూపుదాలుస్తుండడం ప్రభుత్వానికి ఆందోళన కలిగిస్తోంది. పెరుగుతున్న జీవన వ్యయం, క్షీణిస్తున్న ఆర్థిక వ్యవస్థ, భద్రతా బలగాల కఠిన చర్యలపై ఆగ్రహంతో ఇరానీయులు వీధుల్లోకి వచ్చి, పాలక ధార్మిక వ్యవస్థకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఈ నిరసనల దృష్ట్యా ఇరాన్ ప్రభుత్వం ఇంటర్నెట్ , అంతర్జాతీయ టెలిఫోన్ కాల్స్ ను నిలిపివేసింది. దీనిపై భద్రతా బలగాలు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించగా, ప్రజలు ‘స్వేచ్ఛ, స్వేచ్ఛ’ అనే నినాదాలతో తమ నిరసనను మరింత ఉధృతం చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో యువత చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రధాన నగరాలు అట్టుడికిపోతున్నాయి. ప్రభుత్వ వాహనాలను దహనం చేస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్లోని ఇస్లామిక్ రిపబ్లిక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా గుర్తింపు పొందిన ఇరాన్ ప్రవాస యువరాజు రెజా పహ్లవి ఇచ్చిన పిలుపు మేరకు కూడా ఆందోళనలు జరుగుతున్నాయి.
ఫహ్లవి పిలుపుతో మరింత ఉధృతం..
పహ్లవి నిరసనలకు పిలుపునిచ్చారు. ఈ పిలుపుతో తెహ్రాన్లోని పలు ప్రాంతాలు నినాదాలతో మార్మోగాయి. ఆయన ఇచ్చిన పిలుపుతో నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. అమెరికాలో ఉన్న పహ్లవి తిరిగి రావాలని ఇరాన్ ప్రజల ఆశాభావంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ప్రవాసంలో ఉన్న పహ్లవి తప్పకుండా తిరిగి వస్తారని ఆయన మద్దతుదారులు అంటున్నారు.
ట్రంప్తో కలిసి పని చేయండి.. పాలనను గాడిలో పెట్టండి
ఖమేనీతో పాటు, యూరోపియన్ నాయకులు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో కలసి పాలనను గాడిలో పెట్టాలని వాగ్దానం చేయాలని పహ్లవి డిమాండ్ చేశారు. ‘ ‘ఇరాన్ ప్రజలతో మళ్లీ సంబంధాలు ఏర్పడేలా అన్ని సాంకేతిక, ఆర్థిక, దౌత్య వనరులను వినియోగించమని నేను వారిని కోరుతున్నాను, తద్వారా వారి స్వరం మరియు సంకల్పం వినబడేలా, కనిపించేలా అవుతుంది. నా ధైర్యవంతమైన సహచరుల స్వరాలు మూగబారనివ్వకండి’ అని తెలిపారు.





