
చారిత్రక తప్పిదాన్ని సరిచేయడానికే పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) తీసుకొచ్చామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. పొరుగు దేశాల్లో హింసకు గురవుతున్న మైనారిటీలకు విముక్తి కల్పిస్తామన్న భాజపా హామీని నెరవేర్చామన్నారు. దిల్లీలో ఏటా నిర్వహించే ఎన్సీసీ ర్యాలీలో మాట్లాడుతూ మంగళవారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొన్ని కుటుంబాల స్వార్థ ప్రయోజనాల వల్ల జమ్మూకశ్మీర్లో స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి సమస్యలు కొనసాగుతూ వచ్చాయని మోదీ ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో ఉగ్రవాదం వేళ్లూనుకుపోయిందన్నారు. వాటి నుంచి భాజపా ప్రభుత్వం విముక్తి కల్పించిందన్నారు. ఇలా అనాదిగా వస్తున్న అనేక సమస్యలకు భాజపా ప్రభుత్వం పరిష్కారం చూపుతోందని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా పాకిస్థాన్పైనా ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. ఇప్పటివరకు జరిగిన మూడు యుద్ధాల్లో పాక్ తోడముడిచిందని గుర్తుచేశారు. ప్రత్యక్ష పోరాటంలో గెలవలేని పాక్ ఉగ్రవాదం ముసుగులో భారత్పై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వాలు దాయాది దేశానికి దీటుగా సమాధానం చెప్పే అంశాలపై నిర్ణయం తీసుకోవడంలో అలసత్వం ప్రదర్శించాయని అన్నారు.
ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాల వల్ల జమ్మూకశ్మీర్ సహా దేశవ్యాప్తంగా శాంతిభద్రతలు వెల్లివిరుస్తున్నాయని చెప్పుకొచ్చారు. దశాబ్దాలుగా నిరాదరణకు గురైన ఈశాన్య రాష్ట్రాల ప్రజల ఆకాంక్షలను సైతం ప్రభుత్వం నెరవేరుస్తోందన్నారు.





