
భారత్, పాకిస్తాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా జోక్యంతో కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది. పాక్ పై భారత్ మెరుపుదాడులకు పాక్కు చావు తప్పి కన్నులొట్టపొయినట్లు అయింది. దీని నుంచి తేరుకునే లోపు పాకిస్తాన్కు మరో షాక్ తగలింది. గత కొంతకాలంగా తమను ప్రత్యేక దేశంగా ఏర్పాటు చేయాలని పాక్ పై తిరుగుబాటు చేస్తున్న బలూచ్ తెగల వారు.. ఎవరూ ఊహించని విధంగా స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్నారు. వివరాల్లోకి వెళితే.. బలూచిస్తాన్, పాకిస్తాన్లోని పశ్చిమ ప్రాంతంలో ఉన్న ఒక ప్రావిన్స్, దీర్ఘకాలంగా స్వాతంత్ర ఉద్యమాలకు కేంద్రంగా ఉంది.
బలూచ్ ప్రజలు తమ సహజ వనరుల దోపిడీ, రాజకీయ హక్కుల కొరత, పాకిస్తాన్ సైన్యం చేస్తున్న అణచివేతలపై ఆరోపణలు చేస్తూ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ-BLA ఈ ఉద్యమంలో ప్రముఖ సాయుధ సంస్థగా ఉంది. ఇది పాకిస్తాన్ సైన్యం, మౌలిక సదుపాయాలపై దాడులు చేస్తూ స్వతంత్ర బలూచిస్తాన్ కోసం పోరాడుతోంది. ఈ క్రమంలోనే నేడు స్వతంత్ర దేశంగా అవతరించినట్లు స్వయంగా ప్రకటించుకుంది. అలాగే నూతన ప్రభుత్వ ఏర్పాటుకు తాము కసరత్తు చేస్తున్నామని క్వెట్టాలో కొత్త పార్లమెంట్ కు ఫోటోలు, జాతీయ చిహ్నం, జాతీయ గీతానికి సంబంధించిన వీడియోను బలూచిస్తాన్ విడుదల చేసింది. అలాగే భారత్ సహా ఇతర దేశాలు తమ కొత్త బలూచిస్తాన్ దేశానికి వచ్చి ఎంబసీలు ఏర్పాటు చేయాలని కోరింది.






