ArticlesNews

భారతీయతకు పల్లె పిలుపు ౩వ భాగం

4views

గురుకులంలో ప్రవేశాల ప్రక్రియ ఎలా ఉంటుంది?

సాందీపని గురుకులంలో ప్రతి సంవత్సరం కేవలం నాల్గవ తరగతిలోకి మాత్రమే విద్యార్థుల ప్రవేశ ప్రక్రియను ఇప్పటివరకు మేం నిర్వహిస్తూ వస్తున్నాం. 40 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతిసంవత్సరం అక్టోబర్, నవంబర్ మాసాలలో దసరా సెలవులలో ప్రవేశాలకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ అవుతుంది. మొదటగా అభ్యర్థులకు పరీక్ష ఉంటుంది. ఇక్కడి గురుకులం బాలురకు ఉద్దేశించినది అయితే విజయవాడలో మాకు అనుబంధ సంస్థ అయిన నివేదిత గురుకులం బాలికల కోసం నడుస్తున్నది. రెండు గురుకులాలకు కలిపి ప్రవేశ పరీక్ష ఉంటుంది. పరీక్ష రాయడానికి దాదాపు 700 మంది దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తుల వడపోత తర్వాత ఎంపికైన వారు పరీక్ష రాస్తారు. ఉత్తీర్ణులైన వారిని ఇంటర్వ్యూకు పిలుస్తాము. సాందీపని గురుకులానికి సంబంధించి తల్లిదండ్రులు, బాలుడు, నివేదిత గురుకులం విషయానికి వస్తే తల్లిదండ్రులు, బాలిక ఇంటర్వ్యూకు హాజరుకావాల్సి ఉంటుంది. వారి ఆలోచనాధోరణి ఎలా ఉంది? పిల్లవాడి మనోగతి ఎలా ఉంది? తెలుసుకోవడానికి ఈ ఇంటర్వ్యూ జరుగుతుంది. విద్యార్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇదే ప్రాంగణంలో విద్యార్థులకు వేసవి శిబిరం నిర్వహిస్తాము. విద్యార్థుల భావజాలం, వారిలో ఎంతవరకు సర్దుకొనిపోయే మనస్తత్వం ఉన్నది తెలుసుకోవడమే శిబిరం ముఖ్యోద్దేశ్యం. ఆ తర్వాత జూన్‌లో గురుకులంలో తరగతులు ప్రారంభమవుతాయి. ప్రస్తుతం నాల్గవ తరగతిలో మూడవ బ్యాచ్ విద్యార్థులు చేరారు. ఈ బ్యాచ్‌లో 42 మంది విద్యార్థులు ఉన్నారు.

ఏకలవ్య సేంద్రియ వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాల గురించి చెప్పండి

పదవ తరగతి తర్వాత రెండేళ్ల కోర్సు ఇక్కడ ఉంటుంది. ఇక్కడ కోర్సు చేసిన మొదటి, రెండవ బ్యాచులకు చెందిన విద్యార్థులు మా దగ్గరే ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ ఉత్తీర్ణులై ఆ తర్వాత అగ్రికý్చర్ బీఎస్సీ చేసిన వారిలో కొందరు సైతం ఈ ప్రాంగణంలో ఉపాధి పొందుతున్నారు. అలా కాకుండా కళాశాల నుంచి బైటకు వెళ్లిన మిగిలిన వారు కూడా ఫౌండేషన్ కార్యకలాపాల్లో ఏదో రూపంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అయితే కళాశాల స్థాయి నుంచి కాకుండా పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో భారతీయతను పాదుగొల్పడానికే సాందీపని గురుకులం నెలకొల్పాము.

దేశీయ ఉత్పత్తులకు సంబంధించి నిరామయ ఉత్పాదన ఎలాంటి పాత్రను పోషిస్తున్నది?

విదేశీ ఉత్పత్తులపైన, నగరంలో దొరికే వస్తువులపై ఆధారపడటానికి బదులుగా నిరామయ ఉత్పాదన కేంద్రంగా మనకు స్థానికంగా లభించే కుంకుడుకాయలు, శీకకాయ వంటి వాటితో సబ్బులు, షాంపూలు, తలనూనె, పళ్ల పొడి లాంటి 25 దేశీయ ఉత్పత్తులను తయారుచేస్తున్నాము. వాటిని తయారుచేసే విధానాన్ని చుట్టుపక్కల గ్రామాలవారికి నేర్పుతున్నాము. వారి ఉత్పత్తులకు మార్కెటింగ్ మార్గాన్ని ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ చూస్తున్నది. అలొవెరా సబ్బులకు సంబంధించిన తయారీ ప్రక్రియను కృషి విజ్జాన్ కేంద్రంలో చేస్తున్నాం. ఇందులో స్థానిక మహిళల భాగస్వామ్యం మిన్నగా ఉంది. ఆ విధంగా చూసి నప్పుడు నిరామయ ఉత్పాదన విషయంలో మేం అనతికాýంలోనే విజయాన్ని సాధించాము.

ఈ ప్రాంగణంలో వేర్వేరు వృత్తి,వ్యాపకాల్లో ఎక్కువగా జెన్‌జెడ్, యువతీయువకులు కనిపిస్తున్నారు.  మీరు యువకులు కావడం వల్ల ఇక్కడ జెన్‌జెడ్ పాత్ర ప్రముఖంగా ఉన్నదని భావించవచ్చా?

ఇప్పటి జెన్‌జెడ్ ఇలా ఆలోచిస్తున్నదంటే(గ్రామీణ వికాసం, భారతీయత) మున్ముందు తరాలు ఇంకెంత గొప్పగా ఆలోచించాలి అనే ఆశయంతో మా పెద్దలు చేపట్టిన మహా యజ్ఞమిది(ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్). అలా మేమంతా  ఆకర్షితులయ్యాము. నేను కూడా కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదనుకొని ఇక్కడకు వచ్చేశాను. ఒక స్ఫూర్తిగా మేమంతా ఇక్కడి పనులలో పాలుపంచుకుంటున్నాము. జెన్‌జెడ్ మాత్రమే కాదు జెన్‌జెడ్ ప్లస్ కూడా ఇక్కడ ఉన్నారు. మా గురుకులం విద్యార్థులు కూడా ఇందులో భాగస్వాములే. భారతీయత అంటే ఇదే. సమష్టి పాలన (కలెక్టివ్ గవర్నెన్స్), సామాజిక బాధ్యత (సోషల్ రెస్పాన్స్‌బిలిటీ)ల మేలు కలయిక.

ఎక్కడాలేని సమీకరణ ఇక్కడ ఎలా సాధ్యమైంది?

ఆలోచన గట్టిదైతే సమీకరణ దానంతట అదే సాధ్యమవుతుంది. ఇక్కడ మనుషుల కన్నా ధ్యేయం గొప్పది. మనుషులు మారతారు. ఆ బాధ్యత (సమష్టి పాలన, సామాజిక బాధ్యత) అలా ఇచ్చారు. అది మా పెద్దల సంకల్ప బలం తప్ప మరొకటి కాదు.

కార్పొరేట్ ఉద్యోగాన్ని కాదనుకున్న మీ నేపథ్యం గురించి చెబుతారా?

నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదివాను. 2009లో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి మెకానికల్ ఇంజినీరింగ్‌లో బీటెక్ చేశాను.ఆ తర్వాత చాలా కంపెనీల్లో పని చేశాను. చివరగా భారత్ ఫోర్జ్ కంపెనీలో కార్పొరేట్ ఎఫైర్స్‌లో విధులు నిర్వర్తించాను. మా పెద్దల ప్రోద్బలంతో దీంట్లోకి (ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్) అడుగుపెట్టాను. ఒక విధంగా నాకు ఇది కల్చర్ షాక్ (సాంస్కృతిక ఆఘాతం.. పూర్తిగా కొత్త రంగంలోకి అడుగుపెట్టడం). చాలా దేశాల్లో తిరిగాను. విదేశాýలో పనిచేశాను. ఇక్కడ లేని అభివృద్ధి అక్కడ(విదేశాలు) ఎలా వచ్చిందంటే అక్కడి వారు వారి గ్రామాలను మర్చిపోలేదు. భారత్ కూడా ఎప్పుడూ మర్చిపోలేదు (గ్రామాలను). మనదేశం మళ్లీ తన పూర్వ వైభవానికి చేరుకుంటుంది అనేందుకు నిదర్శనమే ఈ ఏకలవ్య గ్రామీణ వికాస్ ఫౌండేషన్ ఆవిర్భావం.

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్క ఆలోచనకు ప్రచారం కీలకంగా మారింది. మీ ఫౌండేషన్‌ను ఏ విధంగా ప్రచారం చేస్తున్నారు?

ప్రస్తుతానికి మేము ఆ దిశగా ఆలోచన చేయలేదు. అంటే అందరినీ కలుపుకొనిపోవాలనే ఆలోచన ఐతే మాకు వచ్చింది కానీ మేం చేస్తున్న పనిని ప్రచారం చేసుకోవాలనే ఆలోచనైతే ఇప్పటి వరకు రాలేదు. అలాంటి ఒక ఆలోచన మా వ్యవస్థాపకులకు రాలేదు.. మాకూ రాలేదు. కానీ మాకు సంబంధించిన ప్రచారం అంతా కూడా నోటి మాట ద్వారానే జరుగుతున్నది. మీడియా, ప్రచురణ కర్తలు ద్వారా కొంత ప్రచారం లభిస్తున్నది. కానీ మేము ఫలానా పని చేస్తున్నాము అని చెప్పుకోవడంలో కన్నా కూడా ఎలాంటి ప్రచారం లేకుండా గుర్తింపు పొందడంలోనే ఎక్కువ ఆనందం ఉంటుంది. మేం చేస్తున్న కృషిని గుర్తించండి. మేం మీతో కలిసి నడుస్తాము. మీరూ మాతో కలిసి నడవండి. అందరం కలిసే నడుస్తాం కదా. అయితే మా ఉత్పత్తులకు సంబంధించినంతవరకు మార్కెటింగ్ చేయకతప్పదు. అది కూడా చేయడం ఎందుకు అంటే చుట్టుపక్కల గ్రామాలలో మేం చేస్తున్న ఉత్పత్తుల పట్ల ఆసక్తి కలిగిన ప్రజలు వాటిని స్వయంగా తయారు చేసి నప్పుడు వాటికి మార్కెట్ సృష్టించాలి. లేకపోతే ఉత్పత్తి దారుడు మోసపోయాను అనే భావనలో మిగిలి పోతాడు. అలాంటి భావన కుదరదు.. కుదిరించ కూడదు అని మార్కెటింగ్ వైపు కృషి మాత్రం చాలానే చేస్తున్నాము. చుట్టుపక్కల గ్రామాలకు, హైదరాబాద్ నగరంలో కొన్ని చోట్లా నిరామయ ఉత్పాదనలను విక్రయిస్తున్నాము. కృషి విజ్జాన్ కేంద్ర ఉత్పత్తులను కూడా విక్రయిస్తున్నాము. అలాగే దేశీయ పసుపును ఇక్కడే పండిస్తున్నాము. ఇక్కడే పసుపును చూర్ణంగా చేసి నగరానికి చేరవేస్తున్నాము. మా కళాశాల, గురుకులం.. ఇలా ఇక్కడ ఉన్న అన్ని శాఖలు కూడా ఇక్కడ తయారయ్యే వాటినే వినియోగిస్తున్నాయి. వాటితోనే సరిపెట్టుకుంటు న్నాయి. తద్వారా భారతీయతను, గ్రామీణ జీవనాన్ని త్రికరణశుద్ధితో పాటిస్తున్నాయి.

ఫౌండేషన్ కార్యకలాపాలపై వలసల ప్రభావం ఎలా ఉంది?

ఈ ఫౌండేషన్ పెట్టిందే రివర్స్ బ్రెయిన్ డ్రెయిన్ (వలస పోయిన వారిని తిరిగి రప్పించే ప్రక్రియ) చేయడానికి. ఉన్నచోటనే చేసి చూపించాలి కానీ.. దీనిని(గ్రామీణ వికాసం) నగరంలో ఉండి చేసి చూపిస్తానంటే అది ఎంతవరకు సమంజసం అవుతుంది? ఇది (జింగుర్తి ప్రాంగణం) హైదరాబాద్ నగరానికి 120 కి.మీ.ల దూరంలో ఉంది. ఎంతో ప్రశాంతమైన జీవనం ఇక్కడ ఉంది. నగరాలకు వలసవెళ్లిన రైతులు అక్కడ ఆత్మాభిమానంతో జీవిస్తున్నారా? ఇక్కడే ఉండి ఆత్మాభిమానంతో జీవించడానికి ఇదే దారి అని చూపించడమే ఈ ఫౌండేషన్ ముఖ్యోద్దేశ్యం. ఇక్కడ ఉండి కూడా సంపాదన చేయవచ్చు.

దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు లభిస్తున్నాయి?

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎసఆర్)గా పలు కంపెనీలు మాకు సంపూర్ణ సహాయ, సహకారాలను అందిస్తు న్నాయి. ఆలోచన ఒకటే అయినప్పుడు సహాయ సహకారాలకు కొదవ ఉండదు.

భవిష్యత్ ప్రణాళికలను వివరిస్తారా?

చుట్టుపక్కల 100 గ్రామాలతో పాటుగా మా అనుబంధ సంస్థలతో కలిసి మేం చేస్తున్న పనిని ఒక రోల్ మోడల్ (ఆదర్శ నమÖనా)గా తీర్చిదిద్దడమే ధ్యేయంగా పెట్టుకున్నాము. ఇదే మోడల్‌ను మీరు ఎక్కడైనా అమలు చేయవచ్చు. ఇప్పటికే మేం చేస్తున్న దాంట్లో విజయం సాధించాము. సాధించాల్సింది ఇంకా  ఎంతో ఉంది. వైద్య, ఆరోగ్య సేవల రంగం లోకి అడుగుపెట్టాము. వైద్య శిబిరాలను నిర్వ హిస్తున్నాము. వైద్య సేవలు అందుబాటులో లేని గ్రామాలలోకి కూడా మా సేవలను విస్తరిస్తున్నాము. ఇదే జింగుర్తి ప్రాంగణంలో హృద్రోగాలకు సంబంధించిన వైద్య శిబిరాలను నిర్వహించాము. ప్రతి నెలా రెండవ, నాల్గవ మంగళవారాల్లో నేత్ర శిబిరాలను చేపడుతున్నాము. కంటిలో శుక్లాలతో ఇబ్బందిపడేవారికి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తున్నాము. ఆ క్రమంలో వారిని ఇంటి నుంచి ఆస్పత్రికి సురక్షితంగా తీసుకొని వెళ్లి, శస్త్ర చికిత్స అనంతరం వారిని ఇంటకి తిరిగి చేర్చే బాధ్యతను కూడా మేమే తీసుకుంటున్నాము.మా తదుపరి కార్యాచరణగా మహిళలు, బాలికల ఆరోగ్యంపై దృష్టిని కేంద్రీకరించనున్నాము. మÖత్రపిండాలకు సంబంధించిన వైద్య, ఆరోగ్య కార్యక్రమాన్ని చేపట్టాలని అనుకుంటున్నాము. ఈ విధంగా ఒక గ్రామాన్ని ఎన్ని విధాలుగా ఆదుకో గలమో అన్ని విధాలుగా ఆదుకుంటూ, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్లాలనేదే ఈ ఫౌండేషన్ ధ్యేయం.

ఇంటర్వ్యూ: మహేష్ ధూళిపాళ్ళ