
ఇస్కాన్కు చెందిన చిన్మయ్ కృష్ణదాస్ బ్రహ్మచారికి బుధవారం బంగ్లాదేశ్ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. బంగ్లాదేశ్ జెండాను అగౌరవపర్చారని.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేశారని ఆయనతో సహా 18 మందిపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. దీంతో గతేడాది అక్టోబర్ 30వ తేదీన ఆయన్ను చిట్టగాంగ్లో అరెస్టు చేశారు.
అక్టోబర్ 25న లాల్డింగి మైదానంలో జరిగిన ర్యాలీలో బంగ్లాదేశ్ పతాకం కంటే ఎక్కువ ఎత్తులో కాషాయ జెండాను ఎగురవేయడంతో కేసులు నమోదయ్యాయి. ఆయన అరెస్టు పై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వ్యక్తమైంది. ఒక దశలో అతని తరఫున వాదించేందుకు సిద్ధమైన న్యాయవాదిపై కూడా దాడి జరిగింది. ఈ నేపథ్యంలో దాస్ భద్రతపై భారత్ పలు మార్లు ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఆ తర్వాత నుంచి ఆయన ఎన్నిసార్లు న్యాయస్థానాల్లో బెయిల్ కోసం ప్రయత్నించినా లభించలేదు. ఎట్టకేలకు బుధవారం ఆయనకు న్యాయస్థానంలో ఊరట లభించింది.
బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతని జాగ్రణ్ జోటె అనే సంస్థకు దాస్ ప్రతినిధిగా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ గ్రూప్ మైనార్టీల హక్కులు,భద్రత విషయంలో పనిచేస్తుంది. ఆ దేశంలో మైనార్టీల రక్షణకు చట్టాలు తీసుకురావాలని ఆయన ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు.





