News

ప్రాణాలు తీసి పైశాసిక ఆనందం.. పాక్ హైకమిషన్ వద్ద కేక్ కటింగ్..

325views

జమ్మూలోని అనంత్ నాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదుల కాల్పుల ఘటనలో 26 మంది అమాయక టూరిస్టులు అశువులు బాసిన విషయం తెలిసిందే. దీనిపై దేశమంతా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై వెంటనే చర్యలు తీసుకోవాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ క్రమంలో ప్రధాని మోదీ నివాసంలో కేబినెట్ , హైపవర్ అధికారులతో సమావేశం నిర్వహించి, పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పాక్‌ను అష్టదిగ్భందం చేసే దిశగా చర్యలు తీసుకున్నారు. అయితే ఈ క్రమంలో పాకిస్థాన్‌కు చెందిన ఓ వ్యక్తి కేక్ తీసుకుని వెళ్లే వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది

ఢిల్లీలోని పాక్ హైకమిషన్ కార్యాలయం వద్ద ఒక వ్యక్తి కేక్ తీసుకుని లోపలికి వెళ్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఆ వ్యక్తిని మీడియా వారు వివరాలు అడిగారు. మీరు ఎవరు? ఆ బాక్స్ లో ఏముందీ..? కేక్ ఆర్డర్ చేశారా? అంటూ అనేక రకాలుగా ప్రశ్నించినా.. ఆ వ్యక్తి మాత్రం ఏమీ మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవడంతో నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రాణాలు తీసి, సంబరాలు చేసుకున్నారా.. అంటూ కామెంట్లు చేస్తున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఇంటలిజెన్స్ అధికారులు విచారణ చేపడుతున్నట్లు తెలిసింది.