
పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ హింసపై కలకత్తా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అకడ కేంద్ర బలగాలు మోహరించాలని ఆదేశించింది. అంతేకాకుండా, రెచ్చగొట్టే ప్రసంగాలు చేయవద్దని కోరింది. ముర్షిదాబాద్ జిల్లాలో గత వారం వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు హింసాత్మకంగా మారాయి. ఆ తర్వాత అక్కడ ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే కలకత్తా హైకోర్టు కీలక ఆదేశాలు చేసింది. హింస వల్ల ఇతర ప్రాంతాలకు పారిపోయిన వారికి పునరావాసం కల్పించాలని టీఎంసీ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా, బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరింది.
కాగా.. వక్ఫ్ (సవరణ) చట్టానికి వ్యతిరేకంగా ముర్షిదాబాద్లో గత వారం నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. మాల్దా, ముర్షిదాబాద్, సౌత్ 24 పరగణాలు, హుగ్లీ జిల్లాల్లో నిరసనకారులు పెద్దఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. నిరసనలు ఉద్రిక్తతగా మారడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు సహా పలువురికి గాయాలయ్యాయి. ఈ కేసులో ఇప్పటి వరకు 200 మందికి పైగా అరెస్టు చేశారు. అయితే, ఈ హింసలో బంగ్లాదేశీయుల ప్రమేయం ఉన్నట్లు కేంద్రహోంమంత్రిత్వ శాఖ అనుమానిస్తోంది. ఈ అంశంపై పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.





