
మీరట్లోని రోడ్లపై నమాజ్ చేయరాదంటూ ఉత్తప్రదేశ్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఒక వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో సమర్ధించారు. రోడ్డున్నవి నడవడానికే కానీ నమాజ్లు చేసుకోడానికి కాదన్నారు. మహాకుంభమేళా విజయవంతంగా నిర్వహించడాన్ని ప్రస్తావిస్తూ, అంతపెద్ద కుంభమేళాలో కోట్లాది మంది హిందువులు పాల్గొన్నా ఎలాంటి విధ్వంసం కానీ, వేధింపుల ఘటనలు కానీ చోటుచేసుకోలేదని, మతపరమైన క్రమశిక్షణను హిందువులను చూసి ముస్లింలు నేర్చుకోవాలని అన్నారు. వక్ఫ్ సవరణ బిల్లును విమర్శిస్తు్న్న వారిని కూడా ఆయన తప్పుపట్టారు.
నడవడానికే రోడ్లు
”రోడ్లు అనేవి నవడానికి ఉద్దేశించినవి. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా మాట్లాడేవాళ్లు హిందువులను చూసి క్రమశిక్షణ నేర్చుకోవాలి. ప్రయాగ్రాజ్కు 66 కోట్ల మంది ప్రజలు వచ్చారు. ఎక్కడా ఒక్క దొంగతనం కానీ, ఆస్తి విధ్వంసాలు, లూటీలు, అపహరణలు జరగలేదు. దీనినే మతపరమైన క్రమశిక్షణ అంటారు. మీరు ప్రయోజనాలను కోరుకుంటే మీరు కూడా క్రమశిక్షణను పాటించాలి” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు.
వక్ఫ్ బోర్డులతో ముస్లింలకు ఒరిగేదేమీ లేదు
వక్ఫ్ బిల్లుపై యూపీ సీఎం మాట్లాడుతూ, వక్ఫ్ బోర్డుల వల్ల ముస్లింలకు ఎలాంటి ప్రయోజనం చేకూరడం లేదన్నారు. వక్ఫ్ బోర్డులు సొంతం సంక్షేమం చూసుకుంటున్నాయని, ఆస్తుల దురాక్రమణలకు పాల్పడుతున్నాయని చెప్పారు. హిందూ ఆలయాలు, మఠాలు విద్య-ఆరోగ్యం వంటి ఎన్నో ఛారిటీ కార్యక్రమాలు నిర్వహిస్తుండగా, ఇబ్బడిముబ్బడిగా ఆస్తులున్నా ప్రజా సంక్షేమ కోసం పనులు చేపట్టిన ఒక్క వక్ఫ్ బోర్డు కూడా లేదని అన్నారు. సమాజం గురించి పక్కనపెట్టినా కనీసం ముస్లింల సంక్షేమం కోసమైనా వక్ఫ్ ఆస్తులను వినియోగించారా అని ప్రశ్నించారు. ”ప్రభుత్వానికి చెందిన ఆస్తులు ఎక్కడున్నా వాటిని తమ సొంతం చేసుకునే ఒక మాధ్యమంగా అది (వక్ఫ్) మారింది. ఇప్పటి తక్షణ అవసరం దానిని సంస్కరించడం. సంస్కరణలు ఎప్పుడు చేపట్టినా దానికి వ్యతిరేకత ఉంటుంది. ప్రతిపాదిత వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లింలకు లబ్ధి చేకూరుతుందని నేను నమ్ముతున్నాను” అని యోగి ఆదిత్యనాథ్ అన్నారు





