News

దర్గాలోకి వచ్చిన విదేశీ విద్యార్థులపై మూక దాడి

308views

గుజారాత్‌లో అమానుష ఉదంతం చోటుచేసుకుంది. వడోదర జిల్లాలోని ఒక దర్గాలోకి బూట్లు ధరించి ప్రవేశించిన నలుగురు విదేశీ విద్యార్థులపై మూక దాడి జరిగింది. ఆ విద్యార్థులకు గుజరాతీ భాష అర్థం కాకపోవడంతో ఈ పరిణామం చోటుచేసుకుందని పోలీసులు మీడియాకు తెలిపారు.

ఈ దాడిలో ఒక విద్యార్థి తలకు తీవ్ర గాయమైంది. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేశామని, ఇద్దరు మైనర్లను అదుపులోకి తీసుకున్నామని పోలీసులు తెలిపారు. వాఘోడియా పోలీస్ స్టేషన్‌లో నమోదైన ఎఫ్‌ఐఆర్ ప్రకారం థాయిలాండ్, సూడాన్, మొజాంబిక్, బ్రిటన్‌కు చెందిన నలుగురు విద్యార్థులు పరుల్ విశ్వవిద్యాలయంలో చదువుతున్నారు. మార్చి 14న సాయంత్రం ఈ విద్యార్థులను దాదాపు 10 మంది వ్యక్తులు వెంబడించి దాడి చేశారు. ఆ విద్యార్థులు గుజరాతీ భాష అర్థం చేసుకోలేకపోవడంతో వారిపై దాడి చేశారని ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు. వారు ఒక దర్గాకు వెళ్లగా, వారిని బూట్లు ధరించి రాకూడదని ఒక వ్యక్తి సూచించారు. ఇది వారికి అ‍ర్థం కాలేదు.

దాడి సమయంలో ముగ్గురు విద్యార్థులు తప్పించుకోగలిగారని, థాయ్ విద్యార్థి సుపచ్ కంగ్వాన్రత్న (20)తలకు తీవ్ర గాయాలు అయ్యాయని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. బాధితుడిని పరుల్ సేవాశ్రమ్ ఆసుపత్రిలోని అత్యవసర వార్డులో చేర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసినట్లు వాఘోడియా పోలీస్ స్టేషన్ అధికారి తెలిపారు.