News

ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడొచ్చు : అన్నామలై

298views

ఆలయాలు ఎలా ఉండకూడదో తమిళనాడులో చూడవచ్చని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై అన్నారు. తిరుపతిలో నిర్వహించిన టెంపుల్‌ ఎక్స్‌పోలో ఆయన మాట్లాడుతూ.. 600 ఆలయాలు వెయ్యి సంవత్సరాల క్రితం నిర్మించినవి ఉన్నాయన్నారు. చారిత్రాత్మిక ఆలయాలను రిపేర్ల పేరుతో దుర్మార్గంగా ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. 2026 తమిళనాడులో బీజేపీ అధికారంలోకి వస్తే దేవాదాయ శాఖ నుంచి అన్ని ఆలయాలను విముక్తి చేస్తామన్నారు. తమిళనాడులో దేవాదాయ శాఖ అమల్లోకి వచ్చే నాటికి 44 వేల ఆలయాలకు చెందిన అయిదు లక్షల ఎకరాలు వారి కంట్రోల్ ఉందని.. ఇప్పుడు లక్ష ఎకరాలు మాత్రమే ఆలయాల పరిధిలో ఉందని తెలిపారు.

ఏమైంది నాలుగు లక్షల ఎకరాలు అని చూస్తే రాజకీయ నేతలే 99 నుంచి 50 సంవత్సరాలకు ఒక రూపాయి లీజుకు తీసుకుని ఉన్నారని వెల్లడించారు. మీనాక్షి అమ్మవారి ఆలయం సమీపంలో 50 మీటర్ల దూరంలో బీఫ్ మాసం అమ్ముతున్నారని తెలిపారు. లక్షల మంది మహిళలు వచ్చే ఉత్సవాలకు కూడా మరుగుదొడ్లు ఉండటం లేదని.. ఇలా చేయటం ద్వారా దేవుడికి భక్తులు దూరం అయ్యేలా ద్రవిడ పార్టీలు చేస్తున్నాయని విమర్శించారు.

కాగ్‌కు దేవాదాయ శాఖ లెక్కలు చూటం లేదని.. లక్షల కొద్ది ఆడిట్ అభ్యంతరాలున్నాయన్నారు. కమిషన్ ఏజెంట్ల లాగా అధికారులు ఆలయాల్లో జలగల్లా పని చేస్తున్నారని ఆరోపించారు. వీఐపీ కల్చర్ ఆలయాల నుంచి పోవాలన్నారు. ఆలయాలు ప్రభుత్వం పరిధి నుంచి బయటకు వస్తే బ్రాహ్మణులు ఆలయాలను డామినేట్ చేస్తారని అంటారని.. తమిళనాడులో ఆ పరిస్థితి లేదన్నారు. ఏ కులం వారు ఆలయాన్ని నిర్మించారో వారే ఆయా ఆలయాల్లో అర్చకులుగా పని చేసేలా తమిళనాడులో పూర్వకాలంలో ఆలయాలు ఉన్నాయని తెలిపారు.

తిరుమల ఆలయాన్ని స్టాక్ మార్కెట్‌లో పెట్టాలంటే 2.5 లక్షల కోట్లు మార్కెట్ విలువ ఉంటుందన్నారు. పది టన్నులు బంగారు బ్యాంకుల్లో ఉందని.. 2.5 టన్నుల ఆభరణాలుగా ఉన్నాయన్నారు. 960 చోట్ల ఆస్తులున్నాయని తెలిపారు. 38 శాతం ఉద్యోగాలు తిరుమల ఆలయంపైనే ఆదారపడి ఉందన్నారు. భారతదేశం మొత్తంలో 35 లక్షల ఆలయాలున్నాయని.. ఆలయాలు ఐక్యతకు వేదికలవుతున్నాయని చెప్పారు. దక్షిణాది వారు ఉత్తారాది ఆలయాలకు, ఉత్తారాది వారు దక్షిణాదికి వెళ్లటంతో ఒక్కతాటిపైకి వచ్చి కనెక్టివిటీ పెరుగుతుందని బీజేపీ తమిళనాడు అధ్యక్షుడు అన్నామలై పేర్కొన్నారు.