
న్యాయాధికారుల కోటా నుంచి ఏపీ హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు ఇద్దరి పేర్లను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి సిఫారసు చేసింది. ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా సేవలందిస్తున్న న్యాయాధికారి అవధానం హరిహరనాథశర్మ, హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా పని చేస్తున్న న్యాయాధికారి డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు పేర్లు ఇందులో ఉన్నాయి. వీరి పేర్లకు కేంద్రం ఆమోదముద్ర వేశాక ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరతాయి. రాష్ట్రపతి ఆమోదిస్తే కేంద్ర న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేస్తుంది. వీరిద్దరి నియామకంతో హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్య 30కి చేరుతుంది. మరో ఏడు జడ్జి పోస్టులు ఖాళీగా ఉన్నాయి.
హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్సింగ్ ఠాకుర్ నేతృత్వంలోని కొలీజియం.. వీరిద్దరి పేర్లతోపాటు మరో జిల్లా ప్రధాన న్యాయమూర్తి పేరును గతంలో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది.. సుప్రీం కొలీజియం నిర్ణయం తెలియాల్సి ఉంది.
హరిహరనాథ శర్మ
సుబ్బమ్మ, రామచంద్రయ్య దంపతులకు అవధానం హరిహరనాథ శర్మ 1968 ఏప్రిల్ 16న జన్మించారు. స్వస్థలం కర్నూలు. తండ్రి పురోహితులు. కర్నూలులోని ఉస్మానియా కళాశాలలో శర్మ బీఎస్సీ చదివారు. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం అభ్యసించారు. 1994లో న్యాయవాదిగా బార్ కౌన్సిల్లో పేరు నమోదు చేసుకున్నారు. కర్నూలు జిల్లా కోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు. సీనియర్ న్యాయవాది రామకృష్ణారావు వద్ద వృత్తి మెలకువలు నేర్చుకున్నారు. 1998లో సొంతంగా ప్రాక్టీసు ప్రారంభించారు. 2007 అక్టోబరులో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఉమ్మడి ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయసేవలందించారు. 2017-18లో అనంతపురం జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా (పీడీజే), 2020-22లో విశాఖ పీడీజేగా పనిచేశారు. 2022లో హైకోర్టు రిజిస్ట్రార్గా సేవలందించారు. 2023 నుంచి ఏపీ జ్యుడీషియల్ అకాడమీ డైరెక్టర్గా కొనసాగుతున్నారు.
డాక్టర్ లక్ష్మణరావు
పద్మావతి, వెంకటేశ్వర్లు దంపతులకు డాక్టర్ యడవల్లి లక్ష్మణరావు 1975 ఆగస్టు 3న జన్మించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా కనిగిరి స్వస్థలం. ప్రాథమిక విద్య ప్రకాశం జిల్లాలో సాగింది. నెల్లూరు వీఆర్ న్యాయ కళాశాలలో న్యాయశాస్త్రం చదివారు. క్రిమినల్ లా, కంపెనీ లాలో బంగారు పతకాలు సాధించారు. 2000లో న్యాయవాదిగా పేరు నమోదు చేయించుకున్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాతోపాటు నెల్లూరు, కావలిలలో న్యాయవాదిగా ప్రాక్టీసు చేశారు. 2014లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. ఈ పోటీ పరీక్షలో రాష్ట్ర మొదటి ర్యాంకు సాధించారు. ఏలూరులో అదనపు జిల్లా జడ్జిగా మొదట సేవలందించారు. తర్వాత ఏపీలోని పలు ప్రాంతాల్లో వివిధ హోదాల్లో న్యాయసేవలందించారు. నాగార్జున వర్సిటీ నుంచి పీజీ పూర్తి చేసి రెండు మెరిట్ సర్టిఫికేట్లు సాధించారు. ఏయూ విశ్వవిద్యాలయం నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. 2021లో హైకోర్టు రిజిస్ట్రార్ (జ్యుడీషియల్)గా నియమితులయ్యారు. తర్వాత రిజిస్ట్రార్ జనరల్ (ఆర్జీ)గా నియమితులై ప్రస్తుతం కొనసాగుతున్నారు.