
కల్వరి టెంపుల్ను ప్రభుత్వ అనుమతి లేకుండా నిర్మించారంటూ రాష్ట్ర హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. గుంటూరు జిల్లా నంబూరులో నిర్మించిన కల్వరి టెంపుల్కు ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేవు అంటూ పరస సురేష్ కుమార్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ బిల్డింగ్ రూల్స్ 26 ప్రకారం జిల్లా కలెక్టర్ అనుమతి లేకుండా వందల కోట్లతో కట్టడాలు నిర్మించారని పిటిషనర్ పేర్కొన్నారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు.
సీఆర్డీఏ, రెవెన్యూ అధికారుల నుంచి ఎటువంటి అనుమతులు లేకుండా ప్రమాదకరమైన కట్టడాలు నిర్మించటం చట్టవిరుద్ధం అని న్యాయవాది వాదనలు వినిపించారు. పంచాయతీరాజ్ నిబంధనలకు అనుగుణంగా ఎటువంటి అనుమతులు తీసుకోకుండా రాజకీయ నాయకుల అండదండలతో కట్టడాలు నిర్మించారని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. తక్షణమే ఆ కట్టడాలను కూల్చివేయాలి అంటూ పిటిషనర్ వాదనలు వినిపించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలను పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం.. తక్షణమే కల్వరి టెంపుల్ యాజమాన్యాలకి నోటీసులు జారీ చేసింది. అనంతరం విచారణను 4 వారాలకు వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.





