
263views
ఔషధ విలువలు గల మూలికలు, మొక్కలకు సంబంధించి ఛత్తీస్గఢ్ గిరిజనులు, గ్రామీణుల వద్దనున్న విజ్ఞానాన్ని ప్రామాణీకరించి, భద్రపరచాలనీ, లేకుంటే అది అంతరించిపోతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హెచ్చరించారు. నయా రాయ్పుర్లోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ స్మారక ఆరోగ్య, ఆయుష్ విశ్వవిద్యాలయ స్నాతకోత్సవంలో ఆమె ప్రసంగించారు. అడవి బిడ్డల వద్ద ఉన్న సంప్రదాయ విజ్ఞానంపై పరిశోధనలు జరిపి, దానిని విస్తృతంగా వినియోగంలోకి తెస్తే ఆరోగ్య రక్షణతో పాటు ఉపాధి అవకాశాలూ విస్తరిస్తాయన్నారు. భారతీయుల ఆహార అలవాట్లు ప్రకృతి సమతుల్యతను కాపాడేవిధంగా ఉన్నాయని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ సంస్థ వెలువరించిన లివింగ్ ప్లానెట్ నివేదిక ప్రశంసించడాన్ని రాష్టపతి ముర్ము ప్రస్తావించారు. దీన్నిబట్టి ఆయుర్వేదంపై ఆధారపడిన భారతీయుల సంప్రదాయ జీవనశైలి ప్రాముఖ్యతను అర్థం చేసుకోవచ్చన్నారు.





